Share News

Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలకు వెళ్తున్నారా.. ప్రయాణం మొదలుకొని ఇవన్నీ తప్పక తెలుసుకోండి..

ABN , Publish Date - May 18 , 2025 | 11:24 AM

సరస్వతి పుష్కరాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఈ పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆ ప్రాంత పరిధిలో దర్శించుకోవాల్సిన ప్రముఖ పుణ్యస్థలాలు ఏమున్నాయి.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలకు వెళ్తున్నారా.. ప్రయాణం మొదలుకొని ఇవన్నీ తప్పక తెలుసుకోండి..
Saraswati Pushkaralu

దేశంలో 12 ఏళ్లకు ఒకసారి ప్రధానమైన నదులకు పుష్కరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో గోదావారి, కృష్ణ, తుంగభద్ర, సరస్వతి, భీమ, ప్రాణహిత నదులకు పుష్కరాలు నిర్వహించడం అందరికీ తెలిసిందే. తాజాగా, తెలంగాణలో సరస్వతీ పుష్కరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ పుష్కరాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఈ పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆ ప్రాంత పరిధిలో దర్శించుకోవాల్సిన ప్రముఖ పుణ్యస్థలాలు ఏమున్నాయి.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


తెలంగాణ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 26 వరకూ 12 రోజుల పాటు పుష్కరాలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లనూ చేసింది. ఈ పుష్కరాలకు సుమారు 35 లక్షల మంది భక్తులు తరలిరానున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు. సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సమస్త పాపాలు తొలగిపోవడంతో పాటూ సకల విద్యలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం.


tsrtc.jpg

పుష్కరాలకు ఎలా చేరుకోవాలంటే..

కాళేశ్వరంలో నాలుగు ఎకరాల స్థలంలో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చే భక్తులు భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం వెళ్లొచ్చు. అలాగే ములుగు మీదుగా కూడా కాళేశ్వరానికి చేరుకోవచ్చు. భూపాలపల్లి నుంచి కాళేశ్వరం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. వరంగల్‌‌ రీజియన్‌‌ పరిధి హనుమకొండ, పరకాల, భూపాలపల్లి, జనగామ, తొర్రూరు, నర్సంపేట, మహబూబాబాద్‌‌ డిపోల నుంచి ఆర్టీసీ అధికారుల ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఉదయం 4గంటల నుంచి రాత్రి 11వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు.. సాధారణ ఛార్జీల కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటాయి. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులో మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. హన్మకొండ నుంచి కాళేశ్వరానికి ఎక్స్ ప్రెస్ రూ.250, డీలక్స్ రూ.290, సూపర్ లగ్జరీ 330, రాజధాని రూ.420, గరుడ ప్లస్ రూ.500ల టికెట్ చార్జీ ఉంది. అలాగే ఏసీ బస్సులకు www.tgsrtc.inలో ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు.


kachiguda.jpg

రైళ్లలో వచ్చే వారు ఇలా..

ఇక రైళ్లలో వచ్చే వారు.. హైదరాబాద్​, సికింద్రాబాద్​, కాచిగూడ నుంచి వరంగల్​, కాజీపేటకు చేరుకొని ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాళేశ్వరాని చేరుకోవచ్చు. ఉత్తరాది ప్రాంతాల నుంచి వచ్చేవారు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో దిగి, సమీపంలోని మంచిర్యాల బస్టాండ్ చేరుకోవాలి. మంచిర్యాల నుంచి కాళేశ్వరానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. లేదా చెన్నూరు వెళ్లి అక్కడి నుంచి కాళేశ్వరానికి వెళ్లొచ్చు. అలాగే రామగుండం రైల్వే స్టేషన్‌లో దిగేవారు.. గోదావరిఖని బస్ స్టేషన్‌ చేరుకుని మంథని మీదుగా వెళ్లొచ్చు. అదేవిధంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో దిగితే.. పెద్దపల్లి బస్ స్టేషన్‌ చేరుకుని మంథని మీదుగా కాళేశ్వరానికి చేరుకోవచ్చు.


కాళేశ్వరం చుట్టు పక్కల దర్శనీయ ప్రదేశాలివే..

కాళేశ్వరం చుట్టు పక్కల కొన్ని దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులు పనిలో పనిగా ఈ ప్రాంతాలను కూడా సందర్శించి రావచ్చు.


kotagullu.jpg

కోటగుళ్లు..

కాళేశ్వరం నుంచి కోటగుళ్లు ప్రాంతానికి 67 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మించిన 22 ఆలయాలు ఉన్నాయి.


Ramappa-Temple.jpg

రామప్ప ఆలయం..

కాళేశ్వరానికి 79 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 13 శతాబ్ధంలో నిర్మించారు. ఎత్తైన నక్షత్ర ఆకారపు పీఠంపై తూర్పు ముఖంగా నిర్మించిన ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపు కూడా లభించింది.


Dharmapuri-Temple.jpg

ధర్మపురి ఆలయం..

కాళేశ్వరానికి 97 కిలోమీటర్ల దూరంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో యోగ నారసింహుడి ఆలయం ఉంది. ఆ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతున్నారు. ధర్మపురికి వెళితే యమపురికి వెళ్లే అవకాశం ఉండదని భక్తుల నమ్మకం. ఇక్కడ బ్రహ్మగుండం, యమగుండం, సత్యవతి గుండం, పాలగుండం, చక్రగుండం పేర్లతో పుష్కరిణిలు ఉన్నాయి.


Thousand-Pillar-Temple.jpg

వేయి స్తంభాల గుడి..

కాళేశ్వరానికి 120 కిలోమీటర్ల దూరంలో వేయి స్తంభాల గుడి ఉంది. ఖిలా వరంగల్‌‌లో ఉన్న ఈ ఆలయానికి 1200 ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయులు నిర్మించిన అనేక ఆలయాల్లో ఇది కూడా ఒకటి. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైన కాకతీయుల కళాతోరణంతో పాటూ అనేక ఆలయాలను ఇక్కడ చూడొచ్చు.


Mulugu-District-Laknavaram-.jpg

లక్నవరం సరస్సు..

కాళేశ్వరం నుంచి 104 కిలోమీటర్ల దూరంలో ములుగుజిల్లా గోవిందరావుపేట మండలంలో లక్నవరం సరస్సు ఉంది. ఈ సరస్సును కాకతీయుల గొలుసుకట్టు చెరువులకు ప్రతీకగా చెబుతుంటారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక ద్వీపాన్ని కలుపుతూ నిర్మించిన తీగల వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే తర్వాత ఇక్క మరో రెండు వంతెనలను కూడా నిర్మించారు.


Medaram.jpg

మేడారం..

కాళేశ్వరానికి 83 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం క్షేత్రం ఉంది. సమ్మక్క సారలమ్మ కొలువైన ఈ ప్రాంతంలో రెండేళ్లకు ఒకసారి వనజాతర నిర్వహిస్తారు.


ఇవి కూడా చదవండి:

రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

సెవెన్ సిస్టర్స్ అద్భుతాల్ని తరిస్తారా.. లక్కీ ఛాన్స్

మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 18 , 2025 | 11:24 AM