Putin: ట్రంప్ వల్లే యుద్ధం ఆగింది!
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:39 AM
భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత చొరవతోనే ఆగిందని రష్యా పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ బుధవారం ఫోన్లో జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపింది.

ట్రంప్తో పుతిన్ ఫోన్ చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది
పుతిన్ సీనియర్ సలహాదారు యూరీ ఉషకోవ్ వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 5: భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత చొరవతోనే ఆగిందని రష్యా పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ బుధవారం ఫోన్లో జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపింది. అయితే భారత్, పాకిస్థాన్ యుద్ధానికి సంబంధించి ఏమేం చర్చించారనేది మాత్రం పేర్కొనలేదు. ట్రంప్, పుతిన్ల ఫోన్ చర్చలకు సంబంధించిన వివరాలను పుతిన్ సీనియర్ సలహాదారు యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ‘‘ఇరువురు నేతలు మధ్య ప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులతో పాటు భారత్, పాక్ మధ్య పరస్పర దాడుల అంశంపైనా చర్చించారు. ట్రంప్ వ్యక్తిగత జోక్యంతో భారత్, పాక్ మధ్య యుద్ధం నిలిచింది..’’ అని పేర్కొన్నారు. తన ఒత్తిడి వల్లే భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని, ఇరు దేశాల మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. వాటిని భారత్ ఖండించింది. కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన చేయడంతో భారత్ అంగీకరించిందని.. ఇందులో మూడో దేశం జోక్యానికి తావులేదని స్పష్టం చేసింది.
పుతిన్ సాయం కోరిన పాక్.. భారత్కే మద్దతు!
భారత్తో ఉద్రిక్తతల విషయంలో జోక్యం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను పాకిస్థాన్ కోరింది. ఈ మేరకు పుతిన్కు పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ రాసిన లేఖను ఆయన ప్రతినిధి సయ్యద్ తారీఖ్ ఫతేమి తాజాగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్కు అందజేశారు. పుతిన్ తన పలుకుబడిని ఉపయోగించుకుని.. పాకిస్థాన్తో భారత్ చర్చలు జరిపి దౌత్యపరమైన పరిష్కారానికి వచ్చేలా ఒత్తిడి చేయాలని కోరారు. అయితే రష్యాలో ఇటీవలే పర్యటించిన డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం.. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరును వివరించింది. భారత్కు రష్యా పూర్తి మద్దతును కూడా సాధించింది.