Donald Trump: సుంకాల ఒప్పందాన్ని చైనా పూర్తిగా ఉల్లంఘిస్తోందన్న ట్రంప్..మళ్లీ వాణిజ్య వార్ తప్పదా..
ABN , Publish Date - May 30 , 2025 | 09:11 PM
అమెరికా-చైనా మధ్య సుంకాల (US China tariffs) వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ట్రంప్ (Donald Trump) తాజా ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? మళ్లీ వాణిజ్య యుద్ధం తప్పదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

చైనా, అమెరికా మధ్య సుంకాల (US China tariffs) యుద్ధం తగ్గుముఖం పట్టినట్లు అనిపించిన సమయంలో, మరోసారి ఉద్రిక్తతలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా చైనాపై తీవ్ర ఆరోపణలు చేశారు. చైనా సుంకాల ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించిందని, ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్పై విమర్శలు గుప్పించిన ట్రంప్, ఈ ఒప్పందం ద్వారా చైనాను ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడినప్పటికీ, వారు ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రంప్ ఆరోపణలు
ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో చైనాపై సంచలన ఆరోపణలు చేశారు. రెండు వారాల క్రితం చైనా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, అమెరికా సుంకాల కారణంగా చైనీస్ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లలో విక్రయించడం దాదాపు అసాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ సుంకాల వల్ల చైనాలో అనేక కర్మాగారాలు మూతపడ్డాయని, పౌర అశాంతి దాదాపు ఖాయమైందని ట్రంప్ అన్నారు. ఈ పరిస్థితులను చూసి, చైనాకు సహాయం చేయాలనే ఉద్దేశంతో తాము ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని, దాని ద్వారా చైనా ఆర్థిక వ్యవస్థ స్థిరపడిందని ట్రంప్ చెప్పారు. అయితే, ఇప్పుడు చైనా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది ఆశ్చర్యకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒప్పందం ఏంటి
ఈ నెల ప్రారంభంలో, అమెరికా, చైనా ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చాయి. గతంలో విధించిన పరస్పర సుంకాలు, ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు ఉపసంహరించుకోవాలని రెండు దేశాలు అంగీకరించాయి. ఈ సమయంలో చైనా అమెరికన్ వస్తువులపై 10 శాతం సుంకాన్ని విధిస్తుంది. అమెరికా చైనా వస్తువులపై 30 శాతం వరకు సుంకం విధిస్తుంది. మే 12, 2025న విడుదలైన ఉమ్మడి ప్రకటనలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు కీలకమని గుర్తించినట్లు పేర్కొన్నారు.
బేస్లైన్ సుంకం
ఈ చర్చలు రెండు దేశాల ఆందోళనలను పరిష్కరించే సామర్థ్యం కలిగి ఉన్నాయని, భవిష్యత్తులో ఈ సంబంధాలను మెరుగుపరచడానికి ఒక ప్రత్యేక విధానం ఏర్పాటు చేస్తామని రెండు దేశాలు అంగీకరించాయి. ఈ 90 రోజుల సమయం ఏప్రిల్ 9, 2025 నుంచి ప్రారంభమైంది. ఈ సమయంలో ట్రంప్ అన్ని దేశాలపై 10 శాతం బేస్లైన్ సుంకం గురించి మాట్లాడారు. అయితే చైనాపై సుంకం 245 శాతం వరకు పెరగవచ్చని సూచించారు. అదే సమయంలో, చైనా అమెరికాపై 125 శాతం సుంకం విధిస్తామని ప్రకటించింది. కానీ ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని అందరూ భావించారు, కానీ ట్రంప్ తాజా ఆరోపణలు ఈ ఆశలపై నీళ్లు చల్లాయి.
చైనా ఒప్పందాన్ని ఎలా ఉల్లంఘించింది
ట్రంప్ ఆరోపణల ప్రకారం చైనా.. ఒప్పందం నిబంధనలను అనుసరించడం లేదు. అయితే, ఈ ఉల్లంఘనల గురించి ఖచ్చితమైన వివరాలను ట్రంప్ ప్రకటించలేదు. చైనా తమ వాణిజ్య విధానాలలో మార్పులు చేయడం లేదా అమెరికన్ వస్తువులపై అదనపు ఆంక్షలు విధించడం వంటివి ఈ ఉల్లంఘనలలో భాగం కావచ్చు. చైనా తరఫున ఈ ఆరోపణలకు స్పందన రాకపోవడంతో, ఈ వివాదం మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఈ ఆరోపణలు మళ్లీ అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధాన్ని రేకెత్తించే అవకాశం ఉంది. గతంలో సుంకాల యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది.
ఇవీ చదవండి:
ప్రమాదంలో ప్రజలు.. కోల్పోనున్న హిందూ కుష్ హిమాలయాలు
నీట్ పీజీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి