Texas Floods: నిమిషాల్లో భూమి మాయం, 51మంది మృతి, 27మంది బాలికలు గల్లంతు
ABN , Publish Date - Jul 06 , 2025 | 07:58 PM
ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. నిమిషాల్లో భూమి మాయమైంది. 51మంది మృతి చెందారు. 27మంది బాలికలు కనిపించకుండా పోయారు. ఇదీ.. అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాక్ రాష్ట్రానికి సంభవించిన వరదల విలయతాండవం.

టెక్సాస్, అమెరికా జులై, 6: ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. నిమిషాల్లో భూమి మాయమైంది. 51 మంది మృతి చెందారు. 27 మంది బాలికలు కనిపించకుండా పోయారు. ఇదీ.. అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాక్ రాష్ట్రానికి సంభవించిన వరదల విలయతాండవం.
కెర్ కౌంటీలో వరదల కారణంగా 15 మంది పిల్లలు సహా కనీసం 43 మంది మరణించారు. సమీపంలోని కౌంటీలలో కనీసం ఎనిమిది మంది చనిపోయారు.
విధ్వంసకరంగా కనిపిస్తున్న చెట్లు.. బోల్తాపడి చెట్ల మీద, కల్వర్టుల మీదా కూర్చొన్న కార్లు, బురదతో నిండిన శిథిలాలతో సెంట్రల్ టెక్సాస్ భయానకంగా మారింది.
కెర్ కౌంటీలోని నది వెంబడి ఉన్న క్రైస్తవ వేసవి శిబిరమైన క్యాంప్ మిస్టిక్ లో ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా అభ్యసిస్తున్న 27 మంది బాలికలు వరద నీటిలో కొట్టుకుపోయారు. వీరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
శుక్రవారం తెల్లవారుజామున కేవలం 45 నిమిషాల్లోనే గ్వాడాలుపే నది విధ్వంసకరంగా మారిపోయింది. వేగంగా ప్రవహించుకుంటూ వచ్చిన వరదనీరు నిమిషాల్లోనే 26 అడుగులు (8 మీటర్లు) ఎత్తు పెరిగి ఇళ్లు, వాహనాలను తుడిచిపెట్టింది.
అటు, శనివారం కూడా శాన్ ఆంటోనియో వెలుపల వర్షాలు కురుస్తూనే ఉండటంతో ప్రమాద హెచ్చరికలు జారీ అవుతూనే ఉన్నాయి. ఆకస్మిక వరద హెచ్చరికలు ఇంకా కొనసాగుతున్నాయి.
వరదల్లో కొట్టుకుపోయిన బాధితులను వెతకడానికి, చెట్లలో చిక్కుకున్న వారిని రక్షించడానికి హెలికాప్టర్లు, పడవలు, డ్రోన్ల సాయంతో గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు.
టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఈ ఆదివారాన్ని రాష్ట్రం కోసం ప్రార్థనా దినంగా ప్రకటించారు. ఇక, అధికారులు 24 గంటలూ పని చేస్తారని, నీరు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు మరింత ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు.
రాష్ట్ర విపత్తు ప్రకటన జారీ చేసి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి అదనపు వనరులను అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు.
బాధితుల కోసం తాను, తన భార్య మెలానియా ప్రార్థిస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 'మా ధైర్యవంతులైన సిబ్బంది సైట్లో ఉన్నారు. వారు ఉత్తమంగా పని చేస్తున్నారని' సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు.
ఇక, కీలకమైన సెంట్రల్ టెక్సాస్లోని గ్వాడాలుపే నది వెంబడి ఉన్న కొండలు.. శతాబ్దాల నాటి యూత్ క్లబ్స్, క్యాంప్ గ్రౌండ్లతో నిండి ఉంటాయి.
దీంతో ఈ ప్రదేశానికి తరతరాలుగా అనేక కుటుంబాలు స్విమ్మింగ్ చేయడానికి, గార్డెన్ పార్టీలు చేసుకోడానికి తరలివస్తారు.
అదీ.. జులై నాల్గవ తేదీ సెలవుదినం కావడంతో ఈ నదీ తీరం మరింత రద్దీగా ఉంది. దీంతో ఆకస్మిక వరదల్లో చిక్కుకుని ఎంతమంది తప్పిపోయారో లెక్కించడం కష్టతరంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం
డిజిటల్ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ
Read Latest Telangana News And Telugu News