United Nations: లష్కరే మీ భూభాగంలోది కాదా
ABN , Publish Date - May 07 , 2025 | 05:22 AM
పాకిస్థాన్ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తప్పుపట్టింది. పహల్గాం ఉగ్రదాడి, పాక్లోని ఉగ్రవాద సంస్థలపై మండలి కీలక ప్రశ్నలు అడిగింది, పాకిస్థాన్ను ఒంటరిగా ఉంచింది

ఉగ్రదాడిపై మీ ప్రమేయం లేదా? మీ తప్పులు కప్పిపుచ్చుకోవద్దు!
పాకిస్థాన్ తీరుపై నిప్పులు చెరిగిన ఐరాస భద్రతా మండలి సభ్యులు
‘పహల్గాం’పై ఉగ్రవాద దాడి సహా అణు, క్షిపణి హెచ్చరికలపై నిలదీత
భారత్పై దుష్ప్రచారం చేయబోయి చీవాట్లు తిన్న దాయాది దేశం
మిత్ర దేశం చైనా సహా అన్నీ మౌనం
న్యూయార్క్, మే 6: ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి చెందిన శక్తిమంతమైన భద్రతా మండలి సమావేశంలో భారత్ను దోషిగా చూపేందుకు, భారత్పై నిప్పులు చెరిగేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్కు తగిన శాస్తి జరిగింది. భారత్పై లేనిపోని ఆరోపణలు చేసి.. ఐరాస దృష్టిలో విలన్ను చేయాలని అత్యుత్సాహం ప్రదర్శించిన పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తిఖార్ అహ్మద్కు భద్రతా మండలి తీవ్రస్థాయిలో చీవాట్లు పెట్టింది. ‘‘మీరు చేస్తున్నదేంటి? అసలు పహల్గాం ఉగ్రదాడిలో లష్కరే తాయిబా ప్రమేయంపై మీరేం చెబుతారు?. ఉగ్ర సంస్థ మీ భూభాగంలోది కాదా? క్షిపణి దాడులు, అణ్వాయుధాల ప్రయోగం అంటూ మీరెందుకు రెచ్చగొడుతున్నారు?. ఇదేం విధానం?.’’ అంటూ.. భద్రతా మండలి అసీంపై నిప్పులు చెరిగింది. దీంతో ఆయన సమాధానం చెప్పలేక, ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించి చతికిలపడ్డారు. ఈ క్రమంలో ఏ ఒక్కదేశానికి చెందిన ప్రతినిధి కూడా పాకిస్థాన్ తరఫున నోరు విప్పేందుకు సాహసించలేదు. అందరూ మౌనంగా ఉండిపోయారు. దీంతో కీలకమైన భద్రతా మండలిలో పాక్ ఏకాకి అయింది. అంతేకాదు.. పాకిస్థాన్ మిత్ర దేశం చైనా కూడా ఈ సమయంలో మౌనంగా ఉండిపోవడం గమనార్హం. కాగా, ఇరు దేశాలు పరస్పర చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని మండలి సూచించింది.
పిలిచి మరీ తలంటించుకుని!
పాకిస్థాన్ ఏరికోరి సోమవారం ఐరాస భద్రతా మండలిలో ‘తమ’ విషయాన్ని చర్చించాలని పట్టుబట్టింది. దీంతో మండలి అధ్యక్షుడు సెకేరిస్ ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసి.. పలు విషయాలు చర్చించాలని నిర్ణయించారు. అయితే.. ఈ సమావేశంలో పాక్ శాశ్వత ప్రతినిధి అసీం.. భారత్పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి భద్రతా మండలి దృష్టిని మళ్లించి, తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. అయితే, భద్రతా మండలి పాక్నే నిలదీసింది. పదునైన ప్రశ్నలతో పాక్ ప్రతినిధి అసీంను ఉక్కిరిబిక్కిరి చేసింది. భారత్పై అసీం చేసిన వ్యాఖ్యలను ‘తప్పుడు అజెండా’ అంటూ అసీం వాదనను సభ్యులు నిర్ద్వంద్వంగా కొట్టిపారేశారు. క్షిపణి పరీక్షలు, అణుదాడుల హెచ్చరికలపై భద్రతా మండలి ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ఇదేం విధానం?. ఇవి హెచ్చరికలు కావా? బెదిరింపులు కావా?. వీటిని ఎలా సమర్థించుకుంటారు?.’’ అని సభ్యులు నిలదీశారు. ‘‘పహల్గాం ఉగ్రదాడి ఘటన వెనుక లష్కరే తాయిబా ఉంది. ఇది మీ భూభాగం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిలో మీ పాత్ర లేదా?. మీరు తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు.’’ అని అసీంను భద్రతా మండలి సభ్యులు నిలదీశారు. కాగా.. ఈ సమావేశంలో పాకిస్థాన్కు అత్యంత ఆప్తమిత్ర దేశంగా ఉన్న చైనా కూడా మౌనం వహించింది.
ఫలించిన మోదీ మంత్రాంగం!
ఐరాసలో పాక్ను ఏకాకి చేయడంలో ప్రధాని మోదీ మంత్రాంగం ఫలించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆయన ఐరాస శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలతో స్వయంగా మాట్లాడిన మోదీ.. ఉగ్రవాదులకు పాక్ అండగా ఉంటున్న వైనాన్ని, పహల్గాం ఉగ్రదాడిని సమగ్రంగా వివరించారు. మరోవైపు శాశ్వత సభ్యత్వం లేని దేశాలతో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడి.. ఐరాసలో పాక్ను ఒంటరిని చేయడంలో విజయం సాధించారు. దీంతో చైనా సహా ఏ ఒక్కదేశం కూడా పాక్కు అనుకూలంగా నోరెత్తకపోవడం గమనార్హం.