Uranium Relocated: 400 కిలోల యురేనియం మాయం.. ఇరాన్ ముందే జాగ్రత్తపడిందా
ABN , Publish Date - Jun 24 , 2025 | 06:47 PM
ఇరాన్ ముందు జాగ్రత్తగా తరలించినట్టు చెబుతున్న 400 కేజీల యురేనియంతో సుమారు 10 అణుబాంబులు తయారు చేయవచ్చనేది ఒక అంచనా. 'మిస్సింగ్' యురేనియం 60 శాతం ఎన్రిచ్ అయిందని, 90 శాతం ఎన్రిచ్ స్థాయికి తీసుకువెళ్తే అణ్వాయుధాలలో ఉపయోగించవచ్చని చెబుతున్నారు.

టెహ్రాన్: ఇరాన్ వద్ద ఇప్పటికీ అణ్వాయుధాలను తయారు చేసేందుకు అవసరమైన ఎన్రిచ్డ్ యురేనియం (Enriched uranium) ఉంది... గేమ్ ముగిసినట్టు కాదు... ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట ఇది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా నేరుగా ఎంట్రీ ఇవ్వడం, ఇరాన్లోని మూడు అణు స్థావరాలపై దాడులు జరపడం, ఆ తర్వాత కొద్ది గంటలకే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించడం వంటి పరిణామాలు వరుసగా చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా దాడులకు ముందే ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, అణుబాంబుల తయారీలో కీలకమైన 400 కేజీల ఎన్రిచ్డ్ యురేనియాన్ని గుట్టుచప్పుడు కాకుండా వేరేచోటికి తరలించిందని సమాచారం.
ఇరాన్ ముందు జాగ్రత్తగా తరలించినట్టు చెబుతున్న 400 కేజీల యురేనియంతో సుమారు 10 అణుబాంబులు తయారు చేయవచ్చనేది ఒక అంచనా. 'మిస్సింగ్' యురేనియం 60 శాతం ఎన్రిచ్ అయిందని, 90 శాతం ఎన్రిచ్ స్థాయికి తీసుకువెళ్తే అణ్వాయుధాలలో ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
ఇరాన్లో ఫోర్డో అణు స్థావరంపై అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో దాడి చేయడానికి ముందే యురేనియాన్ని తరలించి ఉండొచ్చని చెబుతున్నారు. దాడికి ముందు దాడి తరువాత శాటిలైట్ ఫోటోలను చూస్తే నష్టం జరిగిందని తెలుస్తోంది. అయితే యురేనియం ఏమైనట్టు?. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సీనియర్ అధికారులు ప్రైవేటు సంభాషణల్లో ఇప్పటికైతే యురేనియం విషయం తమకు తెలియదనే చెబుతున్నారు. అయితే, వాన్స్ మాత్రం ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ, ఫోర్డో నుంచి యురేనియం బయటకు పోలేదని, బాంబింగ్ తర్వాత వేలాది అడుగుల్లో యురేనియం పూడుకుపోయి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రత్యేక డబ్బాల్లో పెట్టి ట్రక్కుల్లో..
మరోవైపు, యురేనియంను ప్రత్యేక డబ్బాల్లో పెట్టి ట్రక్కులో మరో అండర్ గ్రౌండ్ స్థలానికి ఇరాన్ తరలించి ఉండొచ్చని ఇజ్రాయెల్, అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధంగా జరిగి ఉండేందుకు అవకాశాలున్నాయని పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని ఇద్దరు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. యురేనియం వినియోగం శాంతియుత అవసరాలకేనని ఇరాన్ మొదటి నుంచీ చెబుతుండగా, అణ్వాయుధాల తయారీని సహించేది లేదంటూ ఇజ్రాయెల్ దాడులకు దిగడం ఇరుదేశాల మధ్య యుద్ధానికి దారితీసింది.
ఒప్పందాన్ని ఉల్లంఘించ వద్దు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.. ఇరాన్ కీలక ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి