Share News

మ్యాంగో మ్యాజిక్‌

ABN , Publish Date - May 11 , 2025 | 09:46 AM

ఎండాకాలంలో సందడి అంతా మామిడిదే. ఎక్కడ చూసినా మామిడి పళ్లే. మార్కెట్లో నాలుగైదు రకాలే కొంటాం కానీ... మన దేశంలో 1500 రకాల మామిడి పళ్లను పండిస్తున్నారట. ఆన్‌లైన్‌ ఆర్డర్‌తో ఇప్పుడు ఏ వెరైటీనైనా ఇంట్లో కూర్చుని హాయిగా ఆస్వాదించొచ్చు. మనదేశంలో ప్రసిద్ధి చెందిన కొన్ని మామిడి రకాలివి...

మ్యాంగో మ్యాజిక్‌

- మాల్దా

మామిడి పళ్లలో రారాజుగా బీహార్‌కు చెందిన ‘మాల్దా’ రకం పేరు తెచ్చుకుంది. ఈ పండు తోలు చాలా పలుచగా ఉంటుంది. తోలు తీయగానే పాలలా మామిడి గుజ్జు బయటికి వస్తుంది. అందుకే ఈ పళ్లను దుధియా (పాల) మామిడి అంటారు.

- కేసర్‌

మనదేశంలో లభించే ఖరీదైన మామిడి పళ్లలో ‘కేసర్‌’ ఒకటి. ఈ పండు తోలుతో పాటు గుజ్జు కూడా లేత కేసరి రంగును పోలి ఉంటుంది. అందుకే ఆ పేరు. అహ్మదాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రకం ఎక్కువగా పండుతుంది. జునాఘడ్‌ నవాబులు తొలిసారిగా 1931లో ఈ రకం మామిడిని పండించారు. ఆ తరవాత 1934లో వీటికి ‘కేసరి’ అని నామకరణం చేశారు.


- ఆల్‌ఫాన్సో

మహారాష్ట్రలోని సింద్‌దుర్గ్‌ జిల్లాలోని దేవ్‌గఢ్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మామిడి పళ్లను పండిస్తున్నారు. అవే ‘ఆల్‌ఫాన్సో’ మామిడి. రంగు, రుచి, వాసనల్లో వీటి తరవాతే ఏవైనా. అందుకే వీటి ధర ఎక్కువ. సింద్‌దుర్గ్‌తో పాటు రాయ్‌గఢ్‌, రత్నగిరి జిల్లాల్లో కొంకణి తీరంలో ఈ మామిడి పళ్లను విస్తృతంగా పండిస్తారు. జియోలాజికల్‌ ఇండికేషన్‌ (జిఐ) ట్యాగ్‌ను పొందిన ఘనమైన మామిడి పళ్లు దేవ్‌గఢ్‌ ఆల్‌ఫాన్సో మార్కెట్లో ఈ పళ్ల పేరుతో ఎన్నో నకిలీలు పుట్టుకొచ్చాయి. ఇటీవలే దేవ్‌గఢ్‌ మామిడి పళ్ల సొసైటీ ప్రతీ పండుకూ యుఐడీ సీల్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా నకిలీలను అరికట్టాలన్నదే ఉద్దేశం. మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ పళ్లను ’హాపూస్‌’ గా పిలుస్తారు.


- బాదామి

‘ఆల్‌ఫాన్సో ఆఫ్‌ ద కర్ణాటక’ గా బాదామి మామిడి పళ్లకు పేరు. ఎందుకంటే రుచి, గుజ్జులో ఇది ఆల్‌ఫాన్సోతో సరిపోలుతుంది. అందుకే ఆ పేరు. కర్ణాటకలో లభించే మామిడి రకాల్లో బాదామి ముందుంటుంది. ప్రసిద్ధ బాదామి నగరం పేరునే ఈ పళ్లకి పెట్టారు. ఈ మామిడి పండంతా బంగారు వర్ణంలో, పచ్చగా ఉంటుంది. అయితే తొడిమ దగ్గర మాత్రం ఎర్రగా ఉండడం విశేషం.

- తోతాపురి

మామిడి పళ్లలో రామచిలుక పోలిక ఉందంటే అది ‘తోతాపురి’. ఈ పళ్ల అడుగున చిలక ముక్కులా మొనదేలినట్టు ఉంటుంది. తోలు కూడా మందమే. ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అందుకే వీటికి తోతాపురి (రామచిలుక) అని పేరు. దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఈ రకాలను పండిస్తున్నారు. ఇవి కాస్త పుల్లగా, వగరుగా ఉంటాయి. వీటిని సలాడ్స్‌, పికిల్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు.


- బంగనపల్లి

కర్నూల్‌ జిల్లాలోని బనగానపల్లిలో పెరిగే మామిడి పళ్లు కాబట్టి ఆ పేరు. ఈ రకం మామిడి పక్కా లోకలే అయినా దునియా అంతా పేరు తెచ్చుకుంది. ఇవి సైజులో ఆల్‌ఫాన్సోల కన్నా పెద్దగా ఉంటాయి. పల్చటి తోలు, మెత్తటి గుజ్జు, చక్కటి సువాసన బంగనపల్లిని అందరి ఫేవరెట్‌గా మార్చాయి. ‘సఫేదా’ అనే మరో పేరుతో కూడా వీటిని పిలుస్తారు. పీచు తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వీటితో మ్యాంగోషేక్‌లు చేస్తారు.

- దషేరి

మామిడి రసాల్లో దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నాయి ‘దషేరి’ రకాలు. ఉత్తర భారతంలోని వివిధ ప్రదేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, పాకిస్తాన్‌, నేపాల్‌లో కూడా ఈ మామిడి పళ్లను పండిస్తున్నారు. 18 వ శతాబ్దంలో లక్నో నవాబుల తోటలో తొలిసారి వీటిని పండించారు. తియ్యదనం, సువాసనల్లో దషేరి పళ్లు ముందుంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి

CBI: రూ.70 లక్షల లంచం డిమాండ్‌

Operation Sindoor: ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..

Southwest Monsoon: ముందుగానే నైరుతి రుతుపవనాలు

Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్‌

Read Latest Telangana News and National News

Updated Date - May 11 , 2025 | 09:46 AM