పసి బాబుకు పాలు ఎలా..
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:53 AM
సాధారణంగా పిల్లలు పాలుతాగే విధానాన్ని బట్టే తల్లికి పాలు పడతాయి. పాలు సరిపడా లేకపోవడం అనే సమస్యను లాక్టేషన్ నిపుణుల సహాయంతో తేలికగా ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు. ఇంకా.. వారు తెలియజేసిన వివరాల ప్రకారం...

మా బాబు ఏడో నెలలోనే పుట్టాడు. ఇప్పుడు మూడు నెలలు. నాకు పాలు సరిగా పడలేదనిపిస్తోంది. ఈ సమయంలో బాబుకు తల్లి పాలతో పాటు ఎలాంటి పాలు ఇవ్వవచ్చు?
- శ్రీజ, హైదరాబాద్
నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు బరువు, ఎత్తు సరిగా పెరగాలంటే తగినంత తల్లిపాలు అవసరం. బిడ్డకు నాలుగు నుంచి ఆరు నెలలు వచ్చేప్పటికి వారు పుట్టినప్పటి బరువుకు రెట్టింపు బరువు కావాలి. బరువు ఈ విధంగా పెరగకపోతే వారికి సరిపడా పోషకాలు అందనట్టు గుర్తించాలి. సాధారణంగా పిల్లలు పాలుతాగే విధానాన్ని బట్టే తల్లికి పాలు పడతాయి. పాలు సరిపడా లేకపోవడం అనే సమస్యను లాక్టేషన్ నిపుణుల సహాయంతో తేలికగా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా బిడ్డకు రాత్రివేళ ఎక్కువసార్లు పాలు పట్టడం, పాలు పట్టేప్పుడు చుట్టూ పరిసరాలు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం, తల్లి ఆందోళన లేకుండా ఉండడం, బిడ్డ పాలు తాగిన తరువాత కూడా కాసేపు పాలను పంప్ చేయడం, పాలు పట్టేందుకు సరైన పద్ధతిలో కూర్చోవడం లేదా పడుకోవడం మొదలైన చిన్న చిన్న మార్పుల ద్వారా తల్లి పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. ఈ ఉత్పత్తి నెమ్మదిగా పెరిగే లోపు పిల్లల వైద్యుల సలహాతో వారు సూచించిన ప్రత్యేకమైన ఇన్ఫాంట్ ఫార్ములా పాలను మాత్రమే సరైన పద్ధతిలో కలిపి బిడ్డకు పట్టవచ్చు. ఈ ఫార్ములా పాల కన్నా ఎక్కువ సార్లు తల్లిపాలు ఇచ్చేందుకే ప్రయత్నించాలి. పసి బిడ్డలకు తల్లి పాలు, లేదా వైద్యులు సూచించిన ఇన్ఫాంట్ ఫార్ములా పాలు తప్ప వేరే ఆహారం లేదా ద్రవాలు ఇవ్వరాదు. ఆవు పాలు, గేదె పాలు మొదలైనవీ ఇవ్వకూడదు.
నాకు 60 ఏళ్ళు. షుగర్, బీపీ ఉన్నాయి. ఇంటి పనులు, వంట పనులు నేనే చేసుకుంటాను. ఈ మధ్య త్వరగా అలిసిపోతున్నాను. ఎటువంటి ఆహారం తీసుకుంటే బలం, ఉత్సాహం ఉంటుంది?
- రాధిక, సికింద్రాబాద్
వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో జరిగే పలు రకాల మార్పుల్లో జీవక్రియ వేగం (మెటబాలిక్ రేట్) తగ్గుతుంది. జీర్ణశక్తి క్రమంగా బలహీనపడుతుంది. ఆహారాన్ని శోషించుకునే శక్తి కూడా తగ్గడం మొదలవుతుంది. కాబట్టి ఆహారంలోనే కాక జీవన విధానంలోనూ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే నీరసం తగ్గి శక్తి పెరుగుతుంది. రోజు వారీ ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా తినకుండా, ప్రతీ మూడు గంటలకు ఓసారి కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోవచ్చు. పీచు పదార్థాలు బాగా తీసుకోవడం వల్ల జీర్ణాశయ ఆరోగ్యం కూడా బాగుంటుంది. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం కూడా నడక, యోగా వంటివి చేస్తే మంచిది. వయసు పెరిగేకొద్దీ కండరాల పటుత్వం తగ్గే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పెరుగు లాంటివి తీసుకోవచ్చు. జ్ఞాపకశక్తిని, మెదడు పనితనాన్ని కాపాడే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న చేపలు, అవిసె గింజలు, ఆక్రోట్ గింజలు లాంటివన్నీ రోజూ తీసుకుంటే మంచిది. శరీరానికి తగినంత నిద్రను కూడా అందించాలి. పోషకాహారం, మెరుగైన జీవన విధానం పాటించి నప్పటికీ నీరసం తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి.
ఎండా కాలంలో రాత్రిళ్ళు ఏసీలు, కూలర్లు వాడడం వలన చర్మం, పెదవులు పగులుతున్నాయి. మాయిశ్చరైజర్లు, లోషన్లు రాసుకోడం మాత్రమే కాకుండా ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- వేణి, కర్నూలు
వేసవిలో ఏసీలు, కూలర్ల వాడకం ఎక్కువగా ఉన్నప్పుడు తేమ శాతంలో తేడా వస్తుంది. అందుకే చర్మం పొడిబారడం, పెదవులు పగిలే సమస్యలు చాలా మందికి వస్తాయి. దీనిని నిరోధించడానికి ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. డీహైడ్రేషన్ సమస్య రాకుండా నీళ్లు తరచూ తీసుకొంటూ ఉండాలి. తగినంత నీటిని తాగడంతో పాటు నీరు ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలతో చేసిన సలాడ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి శరీరాన్ని తేమగా ఉంచి చర్మం, పెదవులు పొడిబారకుండా కాపాడతాయి. విటమిన్ - ఈ, విటమిన్ - సి లు కూడా పెదవులు పగలకుండా ఉంచుతాయి. బాదం, ఆక్రోట్, అవిసె, పుచ్చ మొదలైన గింజలను రోజూ తీసుకొంటే విటమిన్ - ఈ పుష్కలంగా అందుతుంది. నిమ్మ, నారింజ, బత్తాయి లాంటి పండ్లలో విటమిన్ - సి అధికం. తినే ఆహారంతో పాటు తరచూ పెదవులకు కొబ్బరి నూనె లేదా నెయ్యి, వెన్న మొదలైనవి రాయడం, శరీరానికి మాయిశ్చరైజర్లు వాడడం కూడా మంచిదే.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)