Share News

Schools: పొద్దున్నే లేవాలి.. బడికి పోవాలి

ABN , Publish Date - Jun 12 , 2025 | 07:43 AM

పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ‘పొద్దున్నే లేవాలి.. బడికి పోవాలి’ అంటూ పిల్లలను తల్లిదండ్రులు సమాయత్తం చేస్తున్నారు.

Schools: పొద్దున్నే లేవాలి.. బడికి పోవాలి

- నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

- పిల్లలను సమాయత్తం చేస్తున్న తల్లిదండ్రులు

- బడిబాట పట్టేందుకు సిద్ధమైన విద్యార్థులు

- మరోవైపు సర్కారు బడుల్లో వెక్కిరిస్తున్న సమస్యలు

- టాయిలెట్లు, తాగునీటి ఇబ్బందులు

- అమ్మ ఆదర్శ పాఠశాల పనులకు నిధుల కొరత

హైదరాబాద్‌ సిటీ: పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ‘పొద్దున్నే లేవాలి.. బడికి పోవాలి’ అంటూ పిల్లలను తల్లిదండ్రులు సమాయత్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉపాధ్యాయుల కొరత లేనట్లే

కొత్త విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేదని చెప్పవచ్చు. గతేడాది నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియ ద్వారా ఆయా జిల్లాల్లో 45 శాతం మంది కొత్త టీచర్లు చేరడంతో విద్యార్థుల బోధన సమస్యలు తీరనున్నాయి. కాగా, నూతన నియామకాలు జరిగినప్పటికీ ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో మూడు జిల్లాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం గమనార్హం.


ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల దోపిడీ షురూ

విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో గ్రేటర్‌లోని పలు ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు మళ్లీ ఫీజుల దోపిడీకి తెరలేపాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ పిల్లల పుస్తకాలు, బ్యాగులు, టై, బెల్టులు తమవద్దే కొనాలని తల్లిదండ్రులకు చెబుతున్నాయి. కొన్ని స్కూళ్లు జూన్‌ ఫీజును కూడా ముందే చెల్లించాలని ఇప్పటికే తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు వాట్సప్‌ మెసేజ్‌లు పంపాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఇలా..

గ్రేటర్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. క్యాలెండర్‌లో తేదీలు మారుతున్నా, తరగతి గదుల్లో ఇబ్బందులు తీరడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


city2.2.jpg

- రాజేంద్రనగర్‌ మండలం భాగతవీగూడ ప్రాథమిక పాఠశాలలో రెండు గదులున్నాయి. ఇందులో గతేడాది 37మంది చదువుకున్నారు. రెండు గదుల్లో ఒక దానిని అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయించగా, మరో గదిలో స్కూల్‌కు కేటాయించారు. దీంతో కొందరు విద్యార్థులు రేకుల షెడ్డు కింద, వరండాలో కూర్చుని చదువుకుంటున్నారు.

- రాజేంద్రనగర్‌ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో మూత్ర విసర్జనకు విద్యార్థులు బయటకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు.

- నాగోల్‌ బండ్లగూడలోని ప్రాథమిక పాఠశాల గోడలకు పెచ్చులూడడంతో పాటు రేకులకు, బండలకు రంధ్రాలు పడి దర్శనమిస్తున్నాయి.

- వనస్థలిపురం కాంప్లెక్స్‌ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. టాయిలెట్‌ డోర్లు తుప్పుపట్టిపోయాయి.


- చంపాపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండేళ్ల క్రితం మన ఊరు- మనబడి పథకంలో భాగంగా అదనపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది.

- మూసారాంబాగ్‌ డివిజన్‌ బాగ్‌ ముసారిమో పాఠశాలలో గదుల కొరత కారణంగా షిప్టు స్కూల్‌గా కొనసాగుతోంది.

- కేపీహెచ్‌బీ మూడోఫేజ్‌లోని భువనం విజయం ప్రభుత్వ పాఠశాల రేకుల షెడ్డులోనే కొనసాగుతోంది.

- మూసాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సరిపడా మూత్రశాలలు లేవు.

- కుల్సుంపురా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం నిండిపోయింది. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయి.


- ముషీరాబాద్‌ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి.

- వాజ్‌పాయినగర్‌లోని ప్రాథమిక పాఠాశా ల పరిసరాలు బురదమయంగా ఉన్నాయి.

- సనత్‌నగర్‌ డివిజన్‌లోని రౌండ్‌టేబుల్‌ సనత్‌నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న మరుగుదొడ్లకు తలుపులు విరిగిపోవడంతో విద్యార్థులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు.

- సికింద్రాబాద్‌ ఎల్‌.నారాయణనగర్‌ ప్రైమరీ ఉర్దూ, ఇంగ్లీష్‌ పాఠశాల లోపల ఫ్లోరింగ్‌ బీటలు పడ్డాయి.

- శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్‌ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. వర్షం కురిస్తే తరగతి గదుల్లోకి నీరు చేరుతుంది.

city2.3.jpg


ఈ వార్తలు కూడా చదవండి.

రూ. 1.2 కోట్ల హాషిష్‌ ఆయిల్‌ పట్టివేత

హలం పట్టి.. పొలం దున్ని..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 12 , 2025 | 07:48 AM