JNTU: జేఎన్టీయూకు కొత్త మార్గదర్శకాలు.. సిద్ధమైన ముసాయిదా
ABN , Publish Date - Aug 01 , 2025 | 07:12 AM
ఇంజనీరింగ్ విద్యలో ఒరవడులకు శ్రీకారం చుడుతూ జేఎన్టీయూ సరికొత్త సిలబస్ను, నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఆర్ 25 రెగ్యులేషన్స్ కోసమని ఏడాదిగా కసరత్తు చేస్తున్న వర్సిటీ అకడమిక్ అఫైర్స్ అధికారుల, నిపుణుల కమిటీ కసరత్తు కొలిక్కి వచ్చింది.

- కొలిక్కివచ్చిన నిపుణుల కసరత్తు
- వీసీ ఆమోదంతో అఫిలియేటెడ్ కాలేజీలకు ప్రతులు
- నిర్మాణాత్మక సూచనలకు రెండ్రోజుల గడువు
- 5 నుంచి అమల్లోకి: డైరెక్టర్ కామాక్షి ప్రసాద్
హైదరాబాద్ సిటీ: ఇంజనీరింగ్ విద్యలో ఒరవడులకు శ్రీకారం చుడుతూ జేఎన్టీయూ సరికొత్త సిలబస్ను, నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఆర్ 25 రెగ్యులేషన్స్ కోసమని ఏడాదిగా కసరత్తు చేస్తున్న వర్సిటీ అకడమిక్ అఫైర్స్ అధికారుల, నిపుణుల కమిటీ కసరత్తు కొలిక్కి వచ్చింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు కానున్న నూతన రెగ్యులేషన్స్ ముసాయిదాకు వైస్చాన్స్లర్ కిషన్కుమార్ రెడ్డి(Vice Chancellor Kishan Kumar Reddy) గురువారం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
ముసాయిదా ప్రతులను వర్సిటీ అఫిలియేటెడ్ కళాశాలలకు పంపిన అకడమిక్ అఫైర్స్ విభాగం అధికారులు, నిర్మాణాత్మకమైన సూచనలు ఉంటే రెండ్రోజుల్లోగా తెలపాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. మరోవైపు ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరడం, తరగతులు ప్రారంభించే తేదీ (ఆగస్టు 14) దగ్గర పడుతుండడంతో ముసాయిదా మార్గదర్శకాలకు తుది మెరుగులు దిద్ది ఈనెల 5 నుంచి ఆర్25 రెగ్యులేషన్స్ను అమల్లోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.
వర్సిటీ పరిధిలోని నాన్ అటానమస్ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఆర్25 నిబంధనలు యథాతథంగా వర్తిస్తాయని, అటానమస్ హోదా కలిగిన కళాశాలలకు ఆర్25 నిబంధనలను మార్గదర్శకంగా తీసుకొని తమ సంస్థలోని కోర్సు నిర్మాణాలను, సిలబ్సను అనుమతించదగిన పరిమితుల్లో మార్పులు చేసుకునే సౌలభ్యం ఉంటుందని యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ విభాగం సంచాలకుడు వి.కామాక్షి ప్రసాద్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..
Read Latest Telangana News and National News