Hyderabad: బయటపడ్డ మరో మోసం.. ఆన్లైన్లో రూమ్ కోసం వెతికితే..
ABN , Publish Date - Jun 06 , 2025 | 07:52 AM
నగరంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో రిసార్ట్ రూములు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను సైబర్ మోసగాడు బురిడీ కొట్టించి రూ.1.33లక్షలు కొట్టేశాడు. ఇక వివరాల్లోకి వెళితే..

నకిలీ సందేశాలతో మాయ చేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: ఆన్లైన్లో రిసార్ట్ రూములు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన మహిళకు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. నకిలీ సందేశాలు పంపుతూ రూ.1.33లక్షలు కాజేశారు. సికింద్రాబాద్(Secunderabad) ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని ఆన్లైన్లో రిసార్ట్ కోసం వెతుకుతుండగా చీరాల సమీపంలో ‘మైరా గోల్డెన్ రిసార్ట్’ గురించిన ప్రకటన కనిపించింది. ప్రకటనలో ఉన్న నంబర్ను సంప్రదించింది.
ఆమెతో ఫోన్లో మాట్లాడిన సైబర్ నేరగాడు రోజుకు రూ. 4 వేలకు రూమ్ కేటాయిస్తామని, అందుకోసం ముందుగా రూ.1 ఆన్లైన్లో పంపాలని కోరాడు. ఆ మాటలు నమ్మిన బాధితురాలు అతడు సూచించిన ఖాతాకు రూ.1 పంపింది. తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి ముందుగా రూ.4 వేలు చెల్లిస్తేనే బుకింగ్ పూర్తవుతుందని చెప్పడంతో ఆ డబ్బు కూడా పంపింది. కొద్ది సేపటికి ఆమె ఖాతాలో రూ.3,990, రూ.39,990 జమ అయినట్లు ఫోన్కు సందేశాలు వచ్చాయి.
వెంటనే ఫోన్ చేసిన వ్యక్తి తాము ఇతరులకు పంపాల్సిన డబ్బు మీ ఖాతాలో జమ అయిందని, డబ్బు తిరిగి పంపాలని ప్రాధేయపడ్డాడు. బాధితురాలు బ్యాంకు ఖాతా చెక్ చేసుకోకుండా అతడు చెప్పిన ఖాతాకు ఆ డబ్బులను పంపింది. జమ కాలేదని మరోసారి ఫోన్ చేసి ఆ వ్యక్తి కోరడంతో గుడ్డిగా మళ్లీ అతడు సూచించిన ఖాతాకు డబ్బు పంపింది. ఇలా పలుమార్లు రూ.1.33 లక్షలు పంపిన తర్వాత ఆ వ్యక్తులు సైబర్ నేరగాళ్లని గుర్తించి సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..
బనకచర్లపై ఉత్తమ్, కవిత తప్పుడు ప్రచారం: బక్కని
Read Latest Telangana News and National News