Hyderabad: రూ.15లక్షల రుణం కోసం 44.83 లక్షలు సమర్పణ
ABN , Publish Date - Apr 17 , 2025 | 07:10 AM
నగరంలో సైబర్ మోసాలు పెట్రేగిపోతున్నాయి. ప్రజల ఆర్ధిక అవసరాలను అడ్డం పెట్టుకొని బ్యాంకుల నుంచి రుణాలిస్తామంటూ నమ్మబలికి ఉన్నది మొత్తం ఊడ్చేస్తున్నారు. రూ.15లక్షల రుణం కోసం సంప్రదిస్తే నగరవాసి నుంచి రూ.44.83 లక్షలు కాజేశారు విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- అంచెలంచెలుగా దోచేసిన నేరగాళ్లు
- కేసుల పేరుతో బెదిరింపులు
హైదరాబాద్ సిటీ: రూ.15లక్షల రుణం కోసం సంప్రదిస్తే నగరవాసి నుంచి రూ.44.83 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు(Cyber criminals). ‘తక్కువ వడ్డీకి రూ.15లక్షల వరకు రుణం వస్తుంది. మహాలక్ష్మి ఫైనాన్స్ వారు ఈ అవకాశం ఇస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు 9863092176 నంబర్లో సంప్రదించండి’ అంటూ ఓ ప్రైవేటు ఉద్యోగి (57)కి వాట్సప్ మెసేజ్ వచ్చింది. నిజమని నమ్మిన బాధితుడు మెసేజ్లో ఉన్న నంబర్లో సంప్రదించాడు. అవతలి వ్యక్తి అడిగిన వివరాలు (ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా) వాట్సప్ ద్వారా పంపాడు.
ఈ వార్తను కూడా చదవండి: National Herald scam: కాంగ్రెస్ ధర్నాలు.. సిగ్గుమాలిన చర్య
అనంతరం సైబర్ నేరగాళ్ల పనేమోనని అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే వాటిని డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఓ వ్యక్తి ఫోన్ చేసి వివరాలు ఎందుకు డిలీట్ చేశారని, లోన్ ప్రాసెసింగ్ చేస్తున్నామని, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పాడు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని, మెరుగుపరిచేందుకు కొంత మొత్తం చెల్లించాలని యూపీఐ స్కానర్ను పంపాడు. బ్యాంకు ఖాతాలో తక్కువ మొత్తం ఉందని దాని కోసం పెనాల్టీ అని ఒకసారి, ఖాతా వివరాలు డిలీట్ చేసినందుకు పెనాల్టీ అంటూ మరికొంత వసూలు చేశారు.
ప్రాసెసింగ్ ఫీజు, రీఫండబుల్ ఎమౌంట్ అంటూ మరికొంత వసూలు చేశారు. మీరు కట్టిన డబ్బు లోన్తో కలిపి వస్తుందని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు విడతల వారీగా రూ.44.83 లక్షలు వసూలు చేశారు. లోన్ వస్తుందని నమ్మిన బాధితుడు అప్పుచేసి మరీ డబ్బును నేరగాళ్లు సూచించిన ఖాతాలకు పంపాడు. కేంద్ర కార్యాలయం నుంచి లోన్ అప్రూవ్ అయిందని, మరికొంత ఫీజు చెల్లించాలని డిమాండ్ చేయగా ‘నా వద్ద డబ్బు లేదు. ఇప్పటి వరకు చెల్లించిన నా డబ్బు ఇవ్వండి’ అని బాఽధితుడు వేడుకున్నాడు. దాంతో సైబర్ నేరగాళ్లు మీపై కేసు నమోదు చేస్తామని బెదిరించడంతోపాటు అసభ్య సందేశాలు పంపుతూ వేధింపులకు గురిచేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News