Hyderabad: ఆ వీడియోను చూసి రూ.19 లక్షలు పోగొట్టుకున్నాడు.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jul 30 , 2025 | 06:36 AM
తక్కువ డబ్బును పెట్టుబడిగా పెట్టి అధిక మొత్తంలో సంపాదించడం ఎలా? అనే ఓ ఇంటర్య్వూను చూసిన వృద్ధుడు అందులో ఇచ్చిన లింకును ఓపెన్ చేసి సైబర్ క్రిమినల్స్ వలకు చిక్కాడు. రూ.19 లక్షలు సమర్పించుకున్నాడు.

- బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: తక్కువ డబ్బును పెట్టుబడిగా పెట్టి అధిక మొత్తంలో సంపాదించడం ఎలా? అనే ఓ ఇంటర్య్వూను చూసిన వృద్ధుడు అందులో ఇచ్చిన లింకును ఓపెన్ చేసి సైబర్ క్రిమినల్స్(Cyber criminals) వలకు చిక్కాడు. రూ.19 లక్షలు సమర్పించుకున్నాడు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు ఆన్లైన్లో వార్తలు చదువుతున్న క్రమంలో అతడు ఒక తమిళ టీవీ చానల్(Tamil TV channel)లో ఓ వీడియో చూశాడు.
తక్కువ డబ్బుతో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడం ఎలా అనే అంశంపై స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి యాంకర్ ‘సాదు సద్గురు’ చెప్పడం విన్నాడు. అధిక సంపాదన కోసం వీడియో కింద ఇచ్చిన లింకును క్లిక్ చేశాడు. వెంటనే సాయిమ్ అనే వ్యక్తి లైన్లోకి వచ్చాడు. షేర్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు, వచ్చే లాభాల గురించి వివరించాడు. వారి మాటలు నమ్మిన వృద్ధుడు పెట్టుబడులు పెట్టాడు.
ప్రారంభంలో మంచి లాభాలు వచ్చేలా చేసిన నిందితులు తర్వాత రూ.19లక్షలు పెట్టుబడిగా పెట్టించారు. లాభాలతో కలిపి రూ.84 లక్షలు వచ్చినట్లు ఆన్లైన్లో చూపించారు. వాటిని విత్డ్రా చేసుకోవాలంటే రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవతలి వ్యక్తుల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అయ్యో.. అని ఆస్పత్రిలో చేర్పిస్తే చంపేశాడని 13నెలలు జైల్లో వేశారు!
బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష
Read Latest Telangana News and National News