Hyderabad: రోజుకు 3 గంటలే పని.. 3 నెలలకు రూ. 50 వేలు
ABN , Publish Date - Jun 03 , 2025 | 07:39 AM
సైబర్ నేరగాళ్లు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. మాయమాటలతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. రోజుకు కేవలం 3 గంటలే పని ఉంటుందని, 3 నెలలకు రూ. 50 వేలు ఇస్తారంటూ నమ్మబలికి రూ. 10.19 లక్షలు కొట్టేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- పార్ట్టైమ్ జాబ్ పేరుతో వల
- పెట్టుబడికి రెట్టింపు లాభమంటూ బురిడీ
- నిరుద్యోగి నుంచి రూ. 10.19 లక్షలు కొట్టేసిన సైబర్ క్రిమినల్స్
హైదరాబాద్ సిటీ: ‘రోజుకు కేవలం 2-3 గంటలు మాత్రమే పార్ట్టైమ్ పనిచేయండి.. 3 నెలలల్లో రూ. 50వేలు సంపాదించండి.. అలాగే పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో రెట్టింపు లాభం ఇస్తాం..’ అంటూ నిరుద్యోగికి వల విసిరి రూ.10.19 లక్షలను సైబర్ క్రిమినల్స్ కొల్లగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఓ బాధితునికి వచ్చిన వాట్సాప్ సందేశానికి స్పందించడంతో రహేజా కార్పొరేషన్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తి రిజిస్ట్రేషన్ లింకును పంపారు.
అందులో రిజిస్టర్ కాగానే వెంటనే రూ.10వేలు బాధితుడి ఖాతాలో వేసి కొన్నిటాస్క్లు ఇచ్చారు. రియల్ఎస్టేట్ సంస్థలకు రివ్వ్యూలు రాస్తే ఆటోమేటిక్గా మీ ఖాతాలో డబ్బులు పడతాయని సైబర్ కేటుగాడు నమ్మించారు. మొదటి 20 టాస్క్లకు రూ. 500 చొప్పున డబ్బును బాధితుడి ఖాతాలో వేశారు. అందులో కొంతడబ్బును మీ పేరున కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నామని, మీరు మరిన్ని పెట్టుబడులు పెడితే తక్కువ సమయం లోనే రెట్టింపు అవుతుందని కేటుగాడు నమ్మించారు.
అలా డబ్బును రెట్టింపుగా ఖాతాలో చూపించి విత్డ్రా అవకాశాలు కల్పించారు. నమ్మకం కుదిరాక రూ. లక్షల్లో పెట్టబడులు పెట్టిస్తూ విడతలవారీగా ఆ మొత్తాన్ని రూ.10.19లక్షలకు పెంచారు. ఆ తర్వాత విత్డ్రా ఆప్షన్ క్లోజ్ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే మరిన్ని పెట్టుబడులు పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఆ కంపెనీ గురించి ఆరా తీయగా బోగస్ కంపెనీ అని తేలింది. దీంతో మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నా పేరు కవిత... నేనెప్పుడూ ప్రజలపక్షమే
రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి
Read Latest Telangana News and National News