Hyderabad: క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్ల పేరుతో మోసం
ABN , Publish Date - Jun 05 , 2025 | 07:12 AM
నగరంలో సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ సైబర్ మోసం జరుగుతూనే ఉంది. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో లక్షల రూపాయలు నష్టపోతున్నారు. తాజాగా మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే..

- రూ. 1..23 లక్షలు కొల్లగొట్టిన సైబర్ క్రిమినల్స్
హైదరాబాద్ సిటీ: క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లను(Credit card reward points) నగదు రూపంలో యాడ్ చేస్తానని బురిడీ కొట్టించిన సైబర్ క్రిమినల్స్.. మోసపూరిత ఏపీకే లింక్ పంపి నగరానికి చెందిన వ్యాపారిని మోసం చేశారు. క్రెడిట్ కార్డులో ఉన్న రూ.1.23 లక్షలు కొట్టేశారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన 35 ఏళ్ల వ్యాపారికి వాట్సాప్ కాల్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్గా పరిచయం చేసుకున్నాడు.
బాధితుడికి మీ క్రెడిట్ కార్డులో రివార్డు పాయింట్లు జమ అయినట్లు నమ్మించారు. ఆ రివార్డు పాయింట్లను నగదుగా మార్చుకునేందుకు అవకాశం ఇస్తామని మీకు పంపిన లింక్ను ఓపెన్ చేస్తే ప్రాసెస్ చేస్తానని నమ్మించాడు. అయితే, బాధితుడిది ఆపిల్ ఫోన్ కావడంతో లింక్ ఓపెన్ కాలేదు. దాంతో ఆ సిమ్ తీసి, వేరే ఫోన్లో వేసి ఓపెన్ చేయాలని నిందితుడు సూచించాడు. అతడి మాటలు నమ్మిన బాధితుడు అలాగే చేశాడు.
ఆ తర్వాత నిందితుడు చెప్పిన విధంగా లింక్ ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు డిటేయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడంతో రివార్డు పాయింట్స్ యాడ్ కాకపోగా.. అతడి ఖాతాలో ఉన్న రూ. 1.23 లక్షలు డెబిట్ అయ్యాయి. దాంతో మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News