SBI: కస్టమర్లకు ఎస్బీఐ బిగ్ అలర్ట్
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:52 PM
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఎస్బీఐ. తన ఖాతాదారులకు కీలక సూచన చేసింది. ఈ సూచనను గమనించాలని కస్టమర్లకు ఎస్బీఐ స్పష్టం చేసింది.
ముంబై, నవంబర్ 16: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. డిజిటల్ చెల్లింపుల విభాగంలో అందిస్తున్న ఎం క్యాష్ (m Cash) సర్వీసును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 30వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు వివరించింది.
ప్రస్తుతం ఈ ఎం క్యాష్ సేవలు.. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ యాప్లలో అందుబాటులో ఉంది. దీని ద్వారా లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాను ముందుగా నమోదు చేయకుండానే.. కస్టమర్లు కేవలం వారి మొబైల్ నెంబర్ లేదా ఈ మెయిల్ ఐడీ ద్వారా నగదు పంపడం లేదా స్వీకరించడం చేసేవారు. అయితే నవంబర్ 30వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉండనుందని ఎస్బీఐ వెల్లడించింది.
ఎం క్యాష్ సేవలు నిలిచిపోనున్న నేపథ్యంలో నగదు బదిలీ కోసం సురక్షితమైన డిజిటల్ పద్దతులను వినియోగించుకోవాలని తమ బ్యాంక్ కస్టమర్లకు ఎస్బీఐ సూచించింది. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలుగా .. యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటివి అందుబాటులో ఉన్నాయని కస్టమర్లకు ఎస్బీఐ సోదాహరణగా వివరించింది.
ఇక ఎం క్యాష్ లాగానే యూపీఐ ద్వారా నగదు పంపడానికి లబ్ధిదారుడిని ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. భీమ్, ఎస్బీఐ పే, యోనో యాప్ల ద్వారా మొబైల్ నెంబర్ లేదా ఖాతా వివరాలతో సులభంగా నగదు లావాదేవీలు జరపవచ్చు. మరోవైపు ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలు యాథాతథంగా పని చేస్తాయని ఎస్బీఐ వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ ఎన్కౌంటర్.. మావోయిస్టులు మృతి
కుటుంబంలో కలహాలు తొలగాలంటే.. ఈ రోజు..
For More Business News And Telugu News