Share News

Supreme Court: అట్రాసిటీ కేసు కదా.. ట్రయల్‌ కోర్టుకే వెళ్లాలి

ABN , Publish Date - May 16 , 2025 | 04:25 AM

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ కోసం సజ్జల భార్గవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ట్రయల్‌ కోర్టుకే వెళ్లాలని సూచించింది. కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.

Supreme Court: అట్రాసిటీ కేసు కదా.. ట్రయల్‌ కోర్టుకే వెళ్లాలి

  • సజ్జల భార్గవ్‌ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ, మే 15 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ వైసీపీ నేత సజ్జల భార్గవ్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు వాఖ్యానించింది. గతేడాది నవంబరులో భార్గవ్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిపై కడప జిల్లా పులివెందులలో హరి అనే దళితుడి ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం ఎదుట గురువారం విచారణకు వచ్చింది. సీనియర్‌ న్యాయవాదులు అందుబాటులో లేని కారణంగా విచారణను వాయిదా వేయాలని భార్గవ్‌ రెడ్డి తరఫు న్యాయవాదులు కోరారు. అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టునే ఆశ్రయించాల్సి ఉంటుంది కదా? అని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Updated Date - May 16 , 2025 | 04:27 AM