Share News

Union Minister Pemmasani: అద్భుతంగా గండికోట

ABN , Publish Date - May 30 , 2025 | 04:26 AM

కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గండికోటను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు 78 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు తెలిపారు. గండికోట ప్రాంతాన్ని గ్రాండ్ కాన్యన్ స్థాయిలో అభివృద్ధి చేయాలని, శ్రీకృష్ణదేవరాయల వంద అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.

Union Minister Pemmasani: అద్భుతంగా గండికోట

  • ప్రఖ్యాత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం: పెమ్మసాని

జమ్మలమడుగు, మే 29(ఆంధ్రజ్యోతి): గండికోటను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. తాను ప్రపంచంలో చాలా అందమైన ప్రాంతాలను చూశానని, గండికోట లాంటి శత్రు దుర్భేద్యమైన కోట, లోయ ఎక్కడా లేవని అన్నారు. విశాలమైన కొండలు, లోయలు ఇక్కడ ఉన్నాయని అన్నారు. గురువారం కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్వగ్రామం దేవగుడికి ఆయన వచ్చారు. అక్కడి నుంచి పర్యాటక ప్రాంతమైన గండికోటను సందర్శించారు. గండికోటలోని ప్రధాన ద్వారం వద్ద నుంచి పావురాల మండపం, కారాగారం పరిశీలించారు. అక్కడి నుంచి జుమ్మా మసీదు, ధాన్యాగారం, లోయ వద్దకు వెళ్లారు. అనంతరం గండికోటలోని మాధవరాయస్వామి దేవాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో గండికోటకు సుమారు 78 కోట్ల రూపాయలు పర్యాటక శాఖ నిధులను కేటాయించామన్నారు. ఈ ప్రాంతాన్ని మరో గ్రాండ్‌ కాన్యన్‌గా పర్యాటక అభివృద్ధి దిశగా నడిపించాలన్నారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో భారతదేశం మొత్తం దండయాత్రలు జరిగినా గండికోటను మాత్రం శత్రువులు ఛేదించలేకపోయారన్నారు. దాదాపు 200 ఏళ్లకు పైగా మనవాళ్లు ఈ కోటను, విజయనగర సామ్రాజ్యాన్ని కాపాడారన్నారు. అందులో ప్రధాన పాత్ర పోషించిన తమ పూర్వీకుడు, చీఫ్‌ కమాండర్‌ పెమ్మసాని రామలింగనాయుడు కవచంలా నిలబడ్డారని వెల్లడించారు. శత్రువు కోట లోపలికి అడుగు పెట్టడానికి వీలు లేకుండా అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఈ కట్టడాలు నిర్మించారన్నారు.


అమెరికాలోని గ్రాండ్‌ కాన్యన్‌ కూడా ఇలాగే ఉంటుందని, కానీ అక్కడ గండికోటలాగా నదీ ప్రవాహం లేదని చెప్పారు. గండికోట తమ పూర్వీకులకు చెందినది కాబట్టి అధికారంలోకి రాగానే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సైతం కేంద్ర టూరిజం శాఖ మంత్రితో మాట్లాడి రూ.78 కోట్ల నిధులు కేటాయించేలా కృషి చేశారన్నారు. టెండర్లు తుది దశలో ఉన్నాయని, ఆదినారాయణరెడ్డి చొరవ చూపి త్వరగా పనులు పూర్తయ్యేలా చేస్తారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారన్నారు. ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గండికోట అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు.

Updated Date - May 30 , 2025 | 04:27 AM