Share News

YS Vijayalakshmi: ప్రేమ తగ్గింది చెల్లిపైనే నాపై కాదు కదా

ABN , Publish Date - May 08 , 2025 | 04:29 AM

సరస్వతి పవర్‌ షేర్ల బదిలీ వివాదం జగన్, విజయలక్ష్మిల మధ్య కోర్టు తీరుకు చేరింది. విజయలక్ష్మి కంపెనీపై పూర్తి హక్కు తనదేనని స్పష్టం చేయగా, జగన్‌ అక్రమంగా వాటాలు బదిలీ చేశారన్న ఆరోపణలు చేశారు

YS Vijayalakshmi: ప్రేమ తగ్గింది చెల్లిపైనే నాపై కాదు కదా

  • సరస్వతి పవర్‌లో 99.89% షేర్లు నా వద్దే

  • ఎన్‌సీఎల్‌టీలో విజయలక్ష్మి వెల్లడి

  • ఆ కంపెనీ వంద శాతం నాదే

  • కుటుంబ వ్యవహారాన్ని కోర్టుకు ఈడ్చారని మండిపాటు

  • తప్పుడు పత్రాలు సృష్టించి నా వాటాల బదిలీ: జగన్‌

  • విజయలక్ష్మే మా యజమాని: సరస్వతి పవర్‌

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ర్టీ షేర్ల బదిలీ విషయంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలో పుట్టిన చిచ్చు.. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ వేదికగా పతాక స్థాయికి చేరింది. జగన్‌ తనకు చెల్లిపై ప్రేమ తగ్గిందనే చెబుతున్నారని.. తల్లిపై తగ్గిందని చెప్పడం లేదని జగన్‌ తల్లి విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ కంపెనీ వంద శాతం తనదేనని స్పష్టంచేశారు. సరస్వతి పవర్‌లో తమ వాటాను మోసపూరిత పద్ధతిలో బదిలీ చేసుకున్నారని.. షేర్ల బదిలీని నిలిపేయాలని, తమ వాటా పునరుద్ధరించాలని కోరుతూ మాజీ సీఎం జగన్‌, భారతి, క్లాసిక్‌ రియాల్టీ.. ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజీవ్‌ భరద్వాజ్‌, సంజయ్‌పూరితో కూడిన ధర్మాసనం బుధవారం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది.


‘సరస్వతి పవర్‌ మా తండ్రి సంపాదించిన ఆస్తి కాదు. ఆయన సంపాదించిన ఆస్తిలో వాటాలు ఎప్పుడో ఇచ్చేశాను. ఆ తర్వాత చెల్లి షర్మిలపై ప్రేమ, అనురాగంతో సరస్వతి పవర్‌లో మాకున్న 51శాతం వాటాను ఈడీ కేసులు ముగిసిన తర్వాత ఇద్దామనుకున్నా. చెల్లి నాపై అనుమానంతో తల్లిపై ఒత్తిడి తెచ్చి వాటాలు బదిలీ చేసుకోవాలని చూస్తోంది. ఎన్నికల సందర్భంగా ఆమె వేరే పార్టీలో చేరి నాపై తీవ్ర విమర్శలు చేసింది. అందుకే ఆమెపై ప్రేమ, అనురాగం పోయాయి. ఆమెకు సరస్వతిలో వాటా ఇచ్చే ఉద్దేశం లేకపోవడంతో ఎంవోయూ, గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చేసుకున్నాం. నేనే దాతనుకాబట్టి ఎంవోయూ, గిఫ్ట్‌డీడ్‌ రద్దుచేసే హక్కు ఉంటుంది. జూలై 6వ తేదీ ఇండెమ్నిటీతో జూలై 2న బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించి.. తల్లి, చెల్లి మోసంచేసి నా వాటా బదిలీ చేసుకున్నారు. ఈ అక్రమ బదిలీని కంపెనీ ఎలా ఆమోదిస్తుంది? ఈ అక్రమాన్ని గుర్తించి నా వాటా నాకు పునరుద్ధరించండి’ అని జగన్‌ కోరారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది, వైసీపీ ఎంపీ ఎస్‌.నిరంజన్‌రెడ్డి, విజయలక్ష్మి తరఫున సీనియర్‌ న్యాయవాది వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు.


‘చెల్లిపై ప్రేమ తగ్గిందని నా కుమారుడు జగన్‌ ఘంటాపథంగా చెబుతున్నారు. తల్లిగా నాపై ప్రేమ తగ్గిందని చెప్పడం లేదు. కంపెనీలో 99.89శాతం వాటా నా వద్దే ఉంది. వందశాతం కంపెనీ నాదే. కుటుంబ వ్యవహారాన్ని కోర్టుకు లాగారు. వివాదాస్పద అంశాలు ఉన్న ఈ వివాదాన్ని తేల్చాల్సింది ఎన్‌సీఎల్‌టీ కాదు. సివిల్‌ కోర్టు తేల్చాలి. నిబంధనల ప్రకారమే నాపేరిట షేర్ల బదిలీ జరిగింది. ఎలాంటి మోసం, కుట్రా లేవు. నా కుమారుడు, నేను ఒకే ఇంట్లో ఉంటున్నాం. అలాంటప్పుడు షేర్‌ సర్టిఫికెట్లు నా వద్ద లేవని ఎలా అంటారు’ అని విజయలక్ష్మి ప్రశ్నించారు. తమ కంపెనీకి విజయలక్ష్మే పూర్తి స్థాయి యజమాని అని సరస్వతి పవర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పాండ్యన్‌ పేర్కొన్నారు. గిఫ్ట్‌ డీడ్‌, ఎంవోయూ తర్వాత జగన్‌ సరస్వతి పవర్‌ బోర్డుకు రాజీనామా వేశారు. కంపెనీకి సంబంధించినంత వరకు ఆయన సంబంధం లేని వ్యక్తి. మా అంతర్గత వ్యవహారాలను ప్రశ్నించడానికి ఆయనెవరు?’ అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో తన క్లయింటుకు సంబంధం లేదని.. ఆమెకు ఏ వాటా లేదని.. ఆమెను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని షర్మిల తరఫు న్యాయవాది కోరారు. షేర్ల బదిలీ కోసం జరిగిన బోర్డు సమావేశంలో పాల్గొనలేదని.. సంతకాల కోసం షర్మిల తనను ఇంటికి పిలిచారని యశ్వంత్‌రెడ్డి అనే డైరెక్టర్‌ తెలియజేశారు. అనంతరం అన్ని పక్షాల వాదనలు పూర్తయ్యాయని ధర్మాసనం ప్రకటించింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పహల్గామ్ దాడిలో మరో కుట్ర..

ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్

ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..

For More AP News and Telugu News

Updated Date - May 08 , 2025 | 04:29 AM