Dam Gate Replacement: ప్రమాదపుటంచుల్లో తుంగభద్ర
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:13 AM
తుంగభద్ర డ్యాం గేట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి, వాటి సామర్థ్యం 40-55% తగ్గిపోయింది. 2026 జూన్ నాటికి మొత్తం 33 గేట్లను మార్పిడి చేయడానికి ₹60 కోట్లతో టెండర్లు పిలవబడినట్లు టీబీపీ బోర్డు ప్రకటించింది.

గేట్లు దెబ్బతిన్నట్లు గుర్తించిన కేఎస్ఎన్డీటీ సర్వీసెస్
తక్షణం అన్నింటినీ మార్చాల్సిందేనని నివేదిక
60 కోట్లతో టెండర్లు పిలిచిన టీబీపీ బోర్డు
2026 జూన్ చివరికి మొత్తం గేట్లన్నీ మార్చేందుకు సన్నాహాలు
కర్నూలు, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటకకు జలప్రదాయినిగా పేరుగాంచిన తుంగభద్ర డ్యాం ప్రమాదపుటంచుల్లో ఉంది. మూడు రాష్ట్రాల్లో 17.33 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు మరమ్మతులపై తక్షణం దృష్టి పెట్టకపోతే పూడ్చలేని నష్టం ఏర్పడుతుందని అధ్యయన నివేదికలు స్పష్టం చేయడంతో తంగభద్ర బోర్డు అప్రమత్తమయింది.
గేట్లు మొత్తం మార్చాల్సిందే
తుంగభద్ర డ్యాంకు 33 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. 2024, ఆగస్టులో 19వ నంబరు గేటు కొట్టుకుపోయింది. దీంతో డ్యాం భద్రతపై ప్రశ్నలు తెలెత్తాయి. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ), డ్యాంను కేత్రస్థాయిలో తనిఖీ చేసిన ఏకే బజాజ్ కమిటీ సిఫార్సుల మేరకు గేట్లు, ప్రాజెక్టు సామర్థ్యంపై టీబీపీ బోర్డు అధ్యయనం చేయించింది. ప్రతి గేటుకు 15 రకాల పరీక్షలు నిర్వహించిన కేఎ్సఎన్డీటీ సంస్థ నివేదికను బోర్డుకు ఇటీవల సమర్పించింది. ‘గేట్లన్నీ భారీగా తుప్పుపట్టి పెద్ద రంధ్రాలు పడ్డాయి. కొన్నిచోట్ల రంధ్రాల వల్ల గేటు ప్లేట్లు బాగుచేయలేనంతగా ధ్వంసమయ్యాయి. 19 గేట్ల సామర్థ్యం 40-55ుకి తగ్గిపోయింది. గుస్సెట్ ప్లేట్లు, దిగువ స్టిఫ్నర్లు, గేట్లకు సపోర్టుగా ఉండే గడ్డర్లు, సపోర్టింగ్ ప్లేట్లు కూడా తుప్పుపట్టి చిల్లులు పడ్డాయి. వెల్డింగ్ దెబ్బతిని, పగుళ్లు ఏర్పడ్డాయి. చాలా వరకు రివిట్లు స్వరూపాన్నే కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నాయి. మొత్తం గేట్లు మార్చాల్సిందే’ అని పేర్కొంది. ప్రాజెక్టుల మెకానికల్ నిపుణుడు కన్నయ్య నాయుడు ‘గేట్ల సామర్థ్యం 45 ఏళ్లే. కానీ, తుంగభద్ర గేట్లు పెట్టి 70 ఏళ్లు దాటింది. అన్నింటినీ మార్చాల్సిందే’ అని గతంలో స్పష్టం చేశారు. బజాజ్ కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రకటించింది.
అప్రమత్తమైన తుంగభద్ర బోర్డు
కేఎస్ఎన్డీటీ నివేదికతో టీబీపీ బోర్డు అప్రమత్తమైంది. 19వ గేటు స్థానంలో కొత్తగేటు ఏర్పాటుకు రూ.1.98 కోట్లతో ఇప్పటికే టెండర్లు పిలిచారు. గుజరాత్కు చెందిన ‘హార్డ్వేర్ టూల్స్’ సంస్థ టెండరు దక్కించుకుంది. జూలై నుంచి జలాశయంలోకి వరద చేరుతుంది. అంటే మిగిలిన సమయం 2 నెలలే. దీంతో 2026, జూన్ ఆఖరుకు మిగిలిన 32 గేట్లు మార్చేందుకు రూ.60 కోట్లతో టీబీపీ బోర్డు ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లు ఈ నెల 19న పిలిచింది. మే 5లోగా ఆన్లైన్ టెండరు షెడ్యూల్ దాఖలు చేయాలి.
గేట్లన్నీ మార్చేందుకు టెండర్లు పిలిచాం
‘కేఎస్ఎన్డీటీ నివేదిక ఇచ్చిన మాట నిజమే. 2026 సీజన్ నాటికి మొత్తం గేట్లు మార్చేసి కొత్త గేట్ల ఏర్పాటుకు రూ.60 కోట్లతో టెండర్లు పిలిచాం. గడువులోగా గేట్లు మారుస్తాం. గత ఏడాది కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్త గేటు ఏర్పాటుకు టెండర్ సంస్థ డిజైన్ ఇచ్చింది. సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్ సీఈ సీడీవోకు పంపించాం. అప్రూవల్ రాగానే పనులు మొదలు పెడుతాం.’
- నారాయణ నాయక్,
ఎస్ఈ, టీబీపీ బోర్డు, హోస్పెట్