TTD: రేపు శ్రీవారి సేవ జూన్ కోటా విడుదల
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:11 AM
తిరుమల శ్రీవారి సేవ జూన్ కోటాను టీటీడీ బుధవారం ఆన్లైన్లో విడుదల చేయనున్నది. కొత్తగా ప్రవేశపెట్టిన గ్రూప్ లీడర్ సేవకు 70 ఏళ్ల లోపు రిటైర్డ్ ఉద్యోగులు అర్హులు

తిరుమల, ఏప్రిల్28(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటాను టీటీడీ బుధవారం ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు సాధారణ సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీతసేవ (మహిళలకు మాత్రమే), ఒంటి గంటకు పరకామణిసేవ (పురుషులకు మాత్రమే) విడుదల చేయనున్నారు. ఇక, కొత్తగా ప్రవేశపెట్టిన ‘గ్రూప్ లీడర్ సేవ’ను 2 గంటలకు విడుదల చేయనున్నారు.
రిటైర్డ్ ఉద్యోగులకు గ్రూప్లీడర్ సేవ
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు సత్యసాయి సేవాసంస్థ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థల్లో భక్తుల స్వచ్ఛంద సేవలను టీటీడీ అధికారులు అధ్యయనం చేసిన తర్వాత టీటీడీలో గ్రూప్ లీడర్ సేవను ప్రవేశ పెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఈ సేవలో పాల్గొనవచ్చు. 70 ఏళ్ల లోపు వయసున్నవారిని అనుమతిస్తారు. శ్రీవారి సేవకుల పర్యవేక్షణ బాధ్యతలు వీరికి అప్పగిస్తారు. 15 రోజుల నుంచి మూడు నెలల దాకా వీరు ఈ సేవలో పాల్గొనాల్సి ఉంటుంది.