Chandrababu: మాట నిలబెట్టుకున్నాం
ABN , Publish Date - Jun 13 , 2025 | 03:35 AM
ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన తల్లికి వందనం అమలుకు శ్రీకారం: సీఎం
67 లక్షల మందికి లబ్ధి.. గత ప్రభుత్వంలో కంటే 24.65 లక్షల మంది అదనం
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ‘‘ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లికి వందనం అమలుపై గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేశ్తో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘నాడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి మాత్రమే ఇవ్వడం సరికాదని చెప్పాం. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తామని చెప్పాం. సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైనది తల్లికి వందనం. నేడు దాన్ని అమలు చేస్తున్నాం. సుమారు 67లక్షల మంది పిల్లలకు రూ.10,091కోట్లు ఖర్చవుతుంది. ఇందులో రూ.1346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళుతుంది. అమ్మఒడి నిబంధనలే తల్లికి వందనం పథకానికీ వర్తింపచేస్తున్నాం. అయితే వైసీపీ ఇంట్లో ఒక్క పిల్లవాడికే ఇస్తే మేం ఎంతమంది ఉన్నా ఇస్తున్నాం. వైసీపీ హయాంలో 42 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే. మా ప్రభుత్వం 67 లక్షల మందికి ఇస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో కన్నా 24.65 లక్షల మందికి అదనంగా ఇస్తున్నాం. ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పిల్లల అడ్మిషన్లు పూర్తయితే వారికి కూడా డబ్బులు వేస్తాం.
తల్లిలేని పిల్లలకు వారి తండ్రి లేదా గార్డియన్ ఖాతాలో డబ్బులు వేస్తాం. అనాథ పిల్లలు అయితే జిల్లా కలెక్టర్ నిర్ధారించిన ఖాతాలో వేస్తాం. ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 76వేల మందికి కూడా తల్లికి వందనం ఇస్తున్నాం. పథకంలో పారదర్శకత కోసం జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే జూన్ 26 లోపు ఫిర్యాదులు తీసుకుని 30న తుది జాబితా ప్రకటిస్తాం’’ అని చంద్రబాబు వివరించారు. తల్లికి వందనం తీసుకునే వారిలో బీసీలే ఎక్కువని చంద్రబాబు తెలిపారు. ‘‘బీసీలు 29లక్షల మంది, ఎస్సీలు 11 లక్షలు, ఎస్టీలు 4 లక్షలు, మైనార్టీలు 66,500, ఈబీసీలు 8లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక బిడ్డ ఉన్న తల్లులు 18,55,760 మంది, ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు 14,55,322, ముగ్గురు బిడ్డలున్న తల్లులు 2,10,684, నలుగురు పిల్లలు ఉన్న తల్లులు 20,053 మంది ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ చిల్డ్రన్ హోమ్స్, ప్లే ఏరియా వంటివి ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
9.5 లక్షల కోట్ల పెట్టుబడులు
‘‘గడిచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకురాగలిగాం. రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. దేశీయ పెట్టుబడుల్లో ఏపీ భారతదేశంలోనే నంబర్ 1గా ఉంది. 16 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్, రిలయన్స్ రెవ్యూపవర్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. విశాఖ స్టీల్ప్లాంట్ను కాపాడుకోగలిగాం. రైల్వే జోన్ సాధించాం. భోగాపురం ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేసుకోగలిగాం. తల్లికి వందనం పథకంలో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.26 వేలు, ముగ్గురుంటే రూ.39 వేలు జమ చేస్తాం. ఓవైపు ఉద్యోగ, ఉపాధి కల్పన, అభివృద్ధి.. మరోవైపు సంక్షేమం అమలు చేస్తూ ప్రజలు ఏ ఆశతో కూటమికి 94 శాతం సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశలు నెరవేర్చే దిశగా ముందుకెళుతున్నాం’’ అని లోకేశ్ పేర్కొన్నారు.
సంక్షేమం.. అభివృద్ధి జోడెద్దుల బండి: లోకేశ్
సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండిలాంటిదని మంత్రి లోకేశ్ అన్నారు. ‘‘ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది.మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నాం. డీఎస్సీని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారు 24 కేసులు వేసింది. ఈ రోజుతో 24వ కేసును కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అన్నింటినీ ఎదుర్కొని డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేస్తున్నాం’’ అని అన్నారు.