Share News

Justice Sarasa Venkatanarayana Bhatt : గూగుల్‌ను కాదు.. గురువులను అనుసరించండి

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:10 AM

న్యాయాధికారులు ఇరుపక్షాల వాదనలు విని తీర్పు ఇచ్చేవారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సరస వెంకటనారాయణ భట్‌ తెలిపారు.

Justice Sarasa Venkatanarayana Bhatt : గూగుల్‌ను కాదు.. గురువులను అనుసరించండి

  • మదనపల్లెలో అదనపు కోర్టు భవనాల ప్రారంభోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌

  • గతేడాది హైకోర్టులో 2,300 పైగా కేసుల పరిష్కారం

  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌

మదనపల్లె, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): గతంలో సౌకర్యాలు లేని సమయంలో న్యాయవాదులు గురువులను ఆదర్శంగా తీసుకుని కోర్టులో వాదనలు వినిపించేవారని, న్యాయాధికారులు ఇరుపక్షాల వాదనలు విని తీర్పు ఇచ్చేవారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సరస వెంకటనారాయణ భట్‌ తెలిపారు. ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా కొందరు న్యాయవాదులు గూగుల్‌ను అనుసరిస్తున్నారే కానీ కోర్టులో ఉన్న గురువులను గుర్తించడం లేదన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కోర్టు సముదాయంలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను జస్టిస్‌ సరస వెంకటనారాయణ భట్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కోర్టు సముదాయానికి చేరుకున్న న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌, జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌కు ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులు గౌరవవందనం సమర్పించారు. ఆ తర్వాత స్థానిక కోర్టులో వెలసిన గంగమ్మ ఆలయంలో న్యాయమూర్తులు ప్రత్యేక పూజలు చేశారు. నూతన భవన సముదాయాలను ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌ మాట్లాడుతూ.. స్వస్థలమైన మదనపల్లెలో విద్యాబోధనలు అందించిన జీఆర్‌టీ హైస్కూల్‌, బీటీ కళాశాలను కీర్తించారు. బెంగళూరులో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తర్వాత తన తండ్రి.. న్యాయవాది సరస రామకృష్ణప్ప, సోదరుడు న్యాయవాది సరస సుబ్రహ్మణ్యం సూచనలతో మూడేళ్లు ఇక్కడి కోర్టులో పనిచేశానని గుర్తు చేసుకున్నారు.కేసులు తీసుకోకుండా కేవలం న్యాయవాదుల వాదనలు, క్రాస్‌ ఎగ్జామిన్లు, న్యాయమూర్తుల తీర్పులను వింటూ నోట్సు రాసుకున్నట్టు జస్టిస్‌ భట్‌ వివరించారు.


జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ హైకోర్టులో 2024లో 2,300 పైగా కేసులు పరిష్కారం అయ్యాయని, అదే విధంగా కింది కోర్టులు కూడా కృషి చేయాలని సూచించారు. హైకోర్టు పోర్టుపోలియో జడ్జి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌, ఏపీ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నల్లారి ద్వారకనాథరెడ్డి, చిత్తూరు జిల్లా జడ్జి భీమరావు ప్రసంగించారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌ తరపున న్యాయమూర్తులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మదనపల్లె సెకండ్‌ ఏడీజీ అబ్రహాం, జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, ఏఎస్పీ వెంకటాద్రి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటరమణరెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి: జస్టిస్‌ భట్‌

చట్టా ల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతూ తద్వారా న్యాయవ్యవస్థపై అందరిలో నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సరస వెంకటనారాయణ భట్‌ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో రూ.15.18 కోట్లతో నిర్మించిన నాలుగు కోర్టు భవనాల సముదాయాన్ని, నలుగురు జడ్జీల నివాస భవనాల సముదాయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. సమస్యలతో వచ్చే ప్రజలకు న్యాయం అందించి న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఉందని జస్టిస్‌ భట్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..

Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..

Updated Date - Feb 09 , 2025 | 04:12 AM