Water Resources Dept: ప్లంజ్పూల్ విస్తరించలేదు
ABN , Publish Date - May 18 , 2025 | 04:57 AM
శ్రీశైలం జలాశయం మరమ్మతుల పనులు వేగవంతం చేయాలని జల వనరుల శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్లంజ్పూల్ విస్తరణ లేదు, కేంద్రం సూచించిన మార్పులు కోసం టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.

గుర్తించిన జలవనరుల శాఖ
శ్రీశైలం మరమ్మతుల ప్రక్రియ వేగవంతం
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): శ్రీశైల జలాశయం దుస్థితిపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ(సీడీఎస్ఏ) తీవ్ర హెచ్చరికలు చేసిన నేపథ్యంలో.. మరమ్మతులపై రాష్ట్ర జల వనరుల శాఖ వేగం పెంచింది. స్పిల్వేకు ఎదురుగా ప్లంజ్పూల్(భారీ గొయ్యి) విస్తరించిందేమోనని జల వనరుల శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. విస్తరించలేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలాగే కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్, దెబ్బతిన్న స్టీల్ సిలెండర్లపై సీడీఎస్ఏ హెచ్చరికలతో వాటి మరమ్మతులపై జల వనరుల శాఖ దృష్టి సారించింది. ఇప్పటిదాకా శ్రీశైల జలాశయం దుస్థితిపైనా, మరమ్మతులపైనా కేంద్ర జలసంఘం, కేంద్ర వాటర్ అండ్ పవర్ పరిశోధనా సంస్థ అధ్యయనం చేసేందుకు రూ.50 లక్షల చెల్లించాల్సిందిగా కోరాయి. ఈ విషయాన్ని జలవనరుల శాఖ ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ఆర్థిక శాఖకు తెలియజేసినప్పటికీ నిధులిచ్చేందుకు ఆర్థికశాఖ తిరస్కరించడంతో అధ్యయనం ఆగిపోయింది. ‘ఆర్థిక శాఖతోనే అసలు పేచీ’ శీర్షికన ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఆ ఫైళ్లపై సీఎంవో ఆరా తీసింది. సీడీడీఏ సూచించిన మేరకు అప్రోచ్ రోడ్, స్టీల్ సిలెండర్ల మార్పిడి కోసం టెండర్లను పిలిచేందుకు జలవనరుల శాఖ సిద్ధమైంది. సమగ్ర నివేదికలూ, అంచనా వ్యయంపై సోమవారం ఆర్థికశాఖతో కలసి జల వనరుల శాఖ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించనుంది.