Share News

Chandrababu Naidu Singapore: ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:16 AM

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం సింగపూర్‌లో దౌత్య కార్యక్రమాల్లో బిజీగా మారింది. ఈ క్రమంలో తాజాగా భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

Chandrababu Naidu Singapore: ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో
Chandrababu Naidu Singapore

సింగపూర్‌లో భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు పి. నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్‌తో పాటు ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం సింగపూర్‌తో ఆంధ్రప్రదేశ్‌ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన అడుగుగా భావించవచ్చు.


ఒక స్ఫూర్తి

హైకమిషనర్ శిల్పక్ అంబులే సింగపూర్‌‎లో ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. సింగపూర్‌ ప్రభుత్వ విధానాలు, గ్రోత్ రేట్, అక్కడి భారతీయుల కార్యకలాపాల గురించి సమగ్రంగా చర్చించారు. సింగపూర్‌లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ ఉండటం ద్వారా వారి సమాజంలో సమతుల్యతను ఎలా సాధిస్తున్నారో కూడా వివరించారు.

ఇండియాతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్‌ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు శిల్పక్ తెలిపారు. సీఎం చంద్రబాబు గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టులో సింగపూర్‌తో భాగస్వామ్యం గురించి గుర్తు చేస్తూ, కొన్ని కారణాల వల్ల ఆ భాగస్వామ్యం కొనసాగలేదని, ఇప్పుడు ఆ లోటును సరిచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.


ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ ఆసక్తి

సింగపూర్ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని హైకమిషనర్ వెల్లడించారు. ముఖ్యంగా, సీఎం చంద్రబాబు బ్రాండ్‌కు సింగపూర్‌లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు, పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం వివరించారు.

గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ఏపీ ముందుకు సాగుతోంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఇప్పటికే పట్టాలెక్కాయని, విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటవుతోందని సీఎం తెలిపారు. అమరావతిలో ఇండియా క్వాంటం మిషన్‌లో భాగంగా క్వాంటం వ్యాలీ కూడా ఏర్పాటు కానుందని వెల్లడించారు.


పారిశ్రామిక కేంద్రంగా..

రాయలసీమ ప్రాంతం డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలకు అనువైన ప్రాంతంగా మారుతుందని సీఎం చెప్పారు. సింగపూర్ నుంచి ఇండియాకు ముఖ్యంగా ఏపీకి పెట్టుబడులు రావాలని, ఈ పెట్టుబడులకు ఏపీ గేట్‌వేగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వివరించారు. పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం హైకమిషనర్‌కు తెలియజేశారు.

విద్యా రంగంలో ఏపీ దూకుడు

మంత్రి నారా లోకేష్ విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏపీలో ప్రముఖ విద్యా సంస్థలు ఇప్పటికే ఏర్పాటవుతున్నాయని, మరిన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సింగపూర్‌ సహకారంతో విద్య, పరిశ్రమలు, సాంకేతికతలో ఏపీ కొత్త శిఖరాలను అధిరోహించేందుకు సన్నద్ధమవుతోంది.


ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 11:18 AM