Share News

Volunteer Scam Exposed: హే రామ్‌

ABN , Publish Date - May 12 , 2025 | 03:11 AM

వలంటీర్ల శిక్షణ పేరిట రామ్‌ ఇన్ఫోకు రూ.274 కోట్ల చెల్లింపులు జరిపిన జగన్‌ సర్కారు, అసలు శిక్షణ ఇచ్చిందని వలంటీర్లు却 ఐప్యాక్‌ సంస్థే అని చెబుతున్నారు. ప్రభుత్వ నిధులు రాజకీయ ప్రయోజనాలకు మళ్లించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి

Volunteer Scam Exposed: హే రామ్‌

  • జగన్‌ జమానాలో 274 కోట్లు హాంఫట్‌

  • వలంటీర్లకు శిక్షణ పేరిట నయా దోపిడీ

  • పేరుకు రామ్‌ ఇన్ఫో.. అక్కడి నుంచి ఐప్యాక్‌కు?

  • సూపర్‌ స్కెచ్‌తో రామ్‌కు ఏటా 68 కోట్లు చెల్లింపు

  • వలంటీర్లకు ఎలాంటి శిక్షణా ఇవ్వని కంపెనీ

  • వైసీపీకి ఉపయోగపడేలా ఐప్యాక్‌ తర్ఫీదు

  • ప్రతిఫలంగా రామ్‌ నుంచి ఆ సంస్థకు సొమ్ములు?

  • ‘నిధుల’పై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి..

ఇదీ కాంట్రాక్టు

జగన్‌ సర్కారులో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం కోసం రామ్‌ ఇన్ఫో అనే సంస్థకు కాంట్రాక్ట్‌ ఇచ్చారు. వలంటీర్ల శిక్షణ పేరిట ఏటా రూ.68.62 కోట్లు చొప్పున చెల్లించారు.

ఇదీ జరిగింది

వలంటీర్లకు రామ్‌ ఇన్ఫో ఎలాంటి శిక్షణా ఇవ్వలేదు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐప్యాక్‌ అనధికారికంగా వారికి శిక్షణ ఇచ్చింది. అది కూడా.. గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయించడం, ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేయడంపై మాత్రమే తర్ఫీదు ఇచ్చింది.

నిధులు ఎవరికి?

రామ్‌ ఇన్ఫోకు నాలుగేళ్లలో రూ.274 కోట్లు చెల్లించారు. కానీ వలంటీర్లకు అసలు శిక్షణే ఇవ్వని రామ్‌ ఇన్ఫోకు చెల్లించిన ఆ సొమ్ములు ఎక్కడికెళ్లినట్టు? పరోక్షంగా శిక్షణ ఇచ్చిన ఐప్యాక్‌కు చేరినట్టు బలమైన ఆరోపణలు ఉన్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ జమానాలో ప్రజలకు సేవ పేరిట తీసుకొచ్చిన వలంటీర్ల వ్యవస్థ వైసీపీకి ఉపయోగపడితే.. వలంటీర్లకు శిక్షణ పేరిట అస్మదీయులకు భారీగా ప్రయోజనం చేకూర్చారు. సర్కారు సొమ్ముతో స్వప్రయోజనాలు పొందేందుకు సరికొత్త దోపిడీకి తెరదీశారు. అధికారికంగా ఈ ‘విషయం’ బయటకు రాకుండా రూ.274 కోట్లు దోపిడీ చేశారు. రామ్‌ ఇన్ఫో అనే సంస్థను ముందు పెట్టి.. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐప్యాక్‌కు నిధులు మళ్లించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వలంటీర్ల శిక్షణకు ఎంపిక చేసిన రామ్‌ ఇన్ఫో శిక్షణ ఇచ్చిందయితే లేదు. కానీ ఆ పేరిట ఆ సంస్థకు సొమ్ములు చెల్లించారు. శిక్షణ కార్యక్రమాలను పరోక్షంగా జగన్‌ ఆత్మీయ సంస్థ ఐప్యాక్‌నే చేపట్టింది. సర్కారు చెల్లించిన రూ.274 కోట్లలో సింహభాగం ఐ ప్యాక్‌ టీమ్‌కే వెళ్లిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదో.. జగన్‌ మార్క్‌ దందాగిరి. చడీచప్పుడు లేకుండా సాగిపోయిన దోపిడీ లోగుట్టు తాజాగా బట్టబయలైంది.


అంతా ఇష్టారాజ్యం

జగన్‌ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయల సిబ్బందికి శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం అనే బాధ్యతను రామ్‌ ఇన్ఫో అనే సంస్థకు కట్టబెట్టారు. ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోకముందే, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకముందే రామ్‌ ఇన్ఫోను ఎంపిక చేశారు. తనతో పాటు మరో రెండు కంపెనీలను కలుపుకొని కన్సార్టియంగా రామ్‌ ఇన్ఫో ముందుకొచ్చింది. కన్సార్టియంలో ఉపాధి టెక్నో సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, మాక్స్‌ డిటెక్టివ్‌ అండ్‌ గార్డింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే కంపెనీలున్నాయి. సాధారణంగా ఒక సంస్థను ఒక ప్రయోజనం కోసం ఎంపిక చేసి కాంట్రాక్ట్‌ ఇవ్వాలనుకుంటే ముందుగానే కాలపరిమితి ఎన్నేళ్లు ఉంటుందో చెబుతారు. ఏడాది లేదా రెండేళ్ల కాలపరిమితిని నిర్దేశిస్తారు. రామ్‌ ఇన్ఫో విషయంలో అలా చేయలేదు. సొంత పనేకదాని అనుకున్నారేమో ఏకంగా నాలుగేళ్లపాటు ఈ సంస్థ సేవలు అందిస్తుందని 2021 మే 31న జారీ చేసిన జీఓ 13లో పొందుపరిచారు. అంటే.. జగన్‌ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ కంపెనీ సేవలు కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు.


ఏటా ఈ కంపెనీకి 68.62 కోట్ల రూపాయలు చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. నిజానికి రామ్‌ ఇన్ఫోకు 2020కి ముందే కాంట్రాక్ట్‌ ఇచ్చారు. ఆ తర్వాత నింపాదిగా 2021 మే 31న కాంట్రాక్ట్‌కు పరిపాలనా అనుమతి, బడ్జెట్‌ కేటాయింపును ఖరారు చేస్తూ జీఓ ఇచ్చారు. అదే ఏడాది జూలైలో ఇచ్చిన జీఓ 16లో వలంటీర్ల శిక్షణే ప్రధాన అంశమని పేర్కొన్నారు. గ్రామ, వార్డు వలంటీర్లకు శిక్షణ పేరిట రామ్‌ ఇన్ఫోకు నాలుగేళ్లలో కలిపి మొత్తం 274.48 కోట్ల రూపాయలు జగన్‌ ప్రభుత్వం చెల్లించింది. ఇది ముందే ఫిక్స్‌ కావడంతో చెల్లింపుల్లో జాప్యం జరగలేదు. అయితే రామ్‌ ఇన్ఫో ఎక్కడా శిక్షణ ఇచ్చింది లేదని ఎంతోమంది వలంటీర్లు చెబుతున్నారు. శిక్షణకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి డేటా కూడా లేదు. కానీ ఏటేటా ఆ కంపెనీకి 68.62 కోట్ల చొప్పున చెల్లింపులు జరిగిపోయాయి. రామ్‌ ఇన్ఫో అసలు ఏం చేసిందో ఎవరికీ తెలియదు.


శిక్షణ ఇచ్చింది ఐప్యాక్‌

వలంటీర్లకు అనధికారికంగా ఐప్యాక్‌ ప్రతినిధులు శిక్షణ ఇచ్చారు. ఇంకా వారిపై సూపర్‌ బాస్‌లుగా మండలం, డివిజన్‌, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక ప్రతినిధులు పనిచేశారు. ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయించాలని ప్రచారం చేశారు. ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చే శారు. ఇలాంటి శిక్షణ ఇచ్చింది ఐప్యాక్‌ సంస్థే అని వలంటీర్లు ఇప్పటికీ చెబుతున్నారు. వలంటీర్లు పూర్తిగా రాజకీయ కోణంలో వైసీపీ, ఐప్యాక్‌ నియంత్రణలోనే పనిచేశారు. ఎన్నికల సమయంలో అదే నిరూపితమైంది. కొందరయితే వైసీపీ కోసమంటూ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వెళ్లిపోయారు.


ఇదీ కంపెనీల చరిత్ర

టెండర్‌ దక్కించుకున్న రామ్‌ ఇన్ఫో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ. కన్సార్టియంగా తెచ్చుకున్న వాటిల్లో ఉపాధి టెక్నో సర్వీసెస్‌ సంస్థ ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చేది. మాక్స్‌ అనే మరో సంస్థ సెక్యూరిటీ గార్డులను సమకూర్చే ఏజెన్సీ. ఇవన్నీ కలసి వలంటీర్లకు ఏమి శిక్షణ ఇచ్చాయన్నది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. శిక్షణపై గ్రామ, వార్డు సచివాలయ విభాగం గతంలో పర్యవేక్షించిన దాఖలా లేదు. ఎలాంటి శిక్షణ ఇచ్చారో ఆరా తీసిందీ లేదు. అడిగేవారే లేకపోవడం, థర్డ్‌ పార్టీ పర్యవేక్షణ లోపించడంతో దోపిడీ అడ్డూఅదుపూ లేకుండా సాగిపోయింది. ఈ ఉదంతంపై సీఐడీ లేదా ఏసీబీతో విచారణ జరిపిస్తే సొమ్ము అసలు ఎవరికి చేరిందో, ప్రభుత్వ సొమ్ము తిన్నది ఎవరో తేలుతుందని, వాస్తవాలు వెలుగు చూస్తాయని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు చెబుతున్నారు.


దొడ్డి దారిన ఐప్యాక్‌కు?

జగన్‌ అధికారంలోకి రాకముందు ఆయన రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాలు, కార్యక్రమాలు, ప్రచార వ్యవహారాలను ఐప్యాక్‌ సంస్థ చూసింది. ఇందుకు ఆ సంస్థకు ఎంత ఇచ్చారో, దానికి లెక్కాపత్రం ఉందో లేదో ఆ పార్టీలోని వారికే తెలియదు. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ సంస్థ చేయని పనిలేదు. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక కూడా ఐప్యాక్‌తో అనుబంధాన్ని కొనసాగించారు. ప్రభుత్వ పాలనలోనూ దాని సేవలను ఉపయోగించుకున్నారు. అయితే వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ఐ ప్యాక్‌కు ప్రభుత్వ సొమ్ము చెల్లిస్తే రాజకీయ దుమారం చెలరేగుతుంది. ప్రభుత్వంఇరకాటంలో పడుతుంది. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ సొమ్ము దోచిపెడుతున్నారన్న విమర్శలకు జగన్‌సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీంతో ఐప్యాక్‌ సేవలు పొందుతున్నారన్న విషయం తెరమీదకు రాకుండా మాస్టర్‌ప్లాన్‌ వేశారు. ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఓఏ) పేరిట ఓ సంస్థను తెరమీదకు తీసుకొచ్చి, దానికి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించి, ఏటా కోట్ల రూపాయలు చెల్లించేలా ప్లాన్‌ వేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే 2019 డిసెంబరులోనే ఈ వ్యూహాన్ని అమలు చేశారు. ఇందుకు ఏపీటీఎస్‌ను, ఆ తర్వాత అవసరాల రీత్యా సృష్టించిన గ్రామ, వార్డు సచివాలయాల విభాగాన్ని జగన్‌ వాడుకున్నారు. ఈ వ్యూహాన్ని అమలు చేసే బాధ్యతను జగన్‌ తన అస్మదీయ సంస్థ అయిన రామ్‌ ఇన్ఫోకు అప్పగించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం జరిగింది.


ఇవి కూడా చదవండి..

పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For Andhrapradesh news and Telugu News

Updated Date - May 12 , 2025 | 06:08 AM