Minister Nadendla Manohar: ఎల్లుండి నుంచే రేషన్ షాపులు
ABN , Publish Date - May 30 , 2025 | 04:41 AM
జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం కానుంది. దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటికే సరఫరా చేయనున్నారని అధికారులు తెలిపారు.

ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు సరకుల పంపిణీ
ఉదయం 8 నుంచి 12.. సాయంత్రం 4 నుంచి 8 వరకు..
దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటికే సరఫరా
బెజవాడలో ట్రయల్ రన్ నిర్వహించిన మంత్రి నాదెండ్ల
అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ రేషన్ సరుకులను పంపిణీ చేసే ఎండీయూ వాహనాలను ప్రభుత్వం రద్దు చేయడంతో జూన్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చౌకఽ ధరల దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటి వరకు మొబైల్ డిస్పెన్స్ యూనిట్లలోని ఈ-పోస్ మిషన్లలో ఉన్న సాఫ్ట్వేర్ను తొలగించి.. రేషన్ డీలర్ల వద్ద నున్న ఈ-పోస్ మిషన్లలోకి కొత్త వెర్షన్ సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేశారు. రేషన్ షాపులోని ఈ-పోస్ మిషన్లో కార్డు నెంబరు ఎంటర్ చేసి.. కార్డుదారుల వేలిముద్రలు వేసి సరుకులు తీసుకునేలా సర్వం సిద్ధం చేశారు. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ చేసేలా నిర్దేశించారు. నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రం ప్రతినెలా 5వ తేదీలోపే డీలర్లు సరుకులను ఇళ్లకే తీసుకువెళ్లి అందజేస్తారు. ఈ మేరకు వృద్ధులు, దివ్యాంగుల జాబితాలను సిద్ధం చేశారు. ఇళ్లు మారినవారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు గతంలో మాదిరిగానే పోర్టబులిటీ విధానంలో స్థానిక రేషన్ షాపుల్లో సరుకులు తీసుకునేందుకు అవకాశం కల్పించారు. డీలరు పేరు, ఫొటో, షాపు నెంబరు, గ్రామం, మండలం పేర్లు రాసిన బోర్డుతోపాటు సరుకుల నిల్వలు తెలియజేసే స్టాక్ బోర్డులను ప్రతి రేషన్ షాపు వద్ద తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డీలర్ల ఆధరైజేషన్ సర్టిఫికెట్లతోపాటు తూనికలు-కొలతలశాఖ స్టాంపింగ్ రసీదులను తప్పనిసరిగా రేషన్ షాపులో ఉంచాలని అధికారులు నిర్దేశించారు. రేషన్ డీలర్లు దుకాణాలను పూలతో అందంగా అలంకరించుకుని.. కూటమి నాయకులతో తొలిరోజు లాంఛనంగా సరుకుల పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి
రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ ఏర్పాట్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పరిశీలించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్తో కలిసి విజయవాడ మధురానగర్లోని 218వ నంబరు రేషన్ షాపును మంత్రి సందర్శించారు. ఈ-పోస్ మిషన్లో కొత్త సాఫ్ట్వేర్ పనితీరును పరిశీలించారు. సరుకుల పంపిణీ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎండీయూ వాహనాలెప్పుడు వస్తాయో తెలియక కార్డుదారులు సరుకుల కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ చేయనున్నందున కార్డుదారులకుఇప్పుడా కష్టాలు ఉండవన్నారు. బియ్యం అక్రమ రవాణా, అవినీతి జరగకుండా పౌరసరఫరాలశాఖ సరికొత్త యాప్ను రూపొందించిందన్నారు. డీలర్ల ఫొటోలతోసహా పూర్తి వివరాలు యాప్లో ఉంటాయని తెలిపారు. రేషన్ షాపు వద్ద క్యూలో ఎక్కువ మంది నిలుచున్నా యాప్ ద్వారా తెలుస్తుందన్నారు.