Share News

AP Deputy Speaker Raghurama: బియ్యం వద్దనుకుంటే కార్డు వెనక్కి ఇవ్వండి

ABN , Publish Date - Jun 04 , 2025 | 03:46 AM

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు, రేషన్ కార్డు మరియు ఆరోగ్యశ్రీ కార్డులను విడిగా ఇవ్వాలన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ సూచించారు. అవసరం లేని వారు రేషన్ కార్డును స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చితే ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల భారం తగ్గుతుందన్నారు.

AP Deputy Speaker Raghurama: బియ్యం వద్దనుకుంటే కార్డు వెనక్కి ఇవ్వండి

  • ఆరోగ్య శ్రీ కార్డు విడిగా ఇస్తే బియ్యం అక్రమ రవాణాను అరికట్టొచ్చు

  • ప్రభుత్వానికి అసెంబ్లీ పిటిషన్ల కమిటీ ప్రతిపాదన

  • డిప్యూటీ స్పీకర్‌ రఘురామ వెల్లడి

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ‘రేషన్‌ కార్డుకు, ఆరోగ్య శ్రీకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. అలా చేస్తే రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు’ అని డిప్యూటీ స్పీకర్‌ కే రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. బియ్యం అవసరం లేని వారు రేషన్‌ కార్డులను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చేయాలని సూచించారు. మంగళవారం అమరావతి శాసనసభ హాలులో ప్రజా ఫిర్యాదుల కమిటీ సమావేశం డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన జరిగింది. ఆరోగ్యశ్రీ అవసరాల కోసం రేషన్‌ కార్డు తీసుకుని, బియ్యం అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదుపై కమిటీ కూలంకషంగా చర్చించింది. అనంతరం ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్‌రాజుతో కలసి రఘురామ మీడియాతో మాట్లాడారు. ‘రేషన్‌ కార్డుతో ఆరోగ్యశ్రీకి సంబంధం ఉండటంతో చాలా మంది కార్డు తీసుకుని, బియ్యం అమ్ముకుంటున్నారు. రెంటినీ విడగొడితే ఈ ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఇదే విషయాన్ని కమిటీ చర్చించింది. స్పీకర్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతాం. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉంటే 1.48 కోట్ల కుటుంబాలకు రేషన్‌ కార్డులున్నాయి. రేషన్‌పై కేంద్రం ఇచ్చేది పోగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,100 కోట్లు ఖర్చు పెడుతోంది. బియ్యం తినని వాళ్లు రేషన్‌ కార్డులు వెనక్కిస్తే సుమారుగా రూ.2 వేల కోట్లు భారం తగ్గుతుంది. ఆ సొమ్మును విద్యాశాఖపై ఖర్చు పెడితే ఇంకాస్త మెరుగైన విద్యా సౌకర్యాలు లభిస్తాయి. ప్రతి కుటుంబానికి ఆరోగ్య శ్రీ కార్డు, రేషన్‌ కార్డు, పెన్షన్‌ కార్డు... దేనికది వేర్వేరుగా ఉంటే బాగుంటుందని కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతుంది. హెల్త్‌ కార్డుకు పెద్దగా నిబంధనలు లేకుండా ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తాం. రేషన్‌ బియ్యం అవసరం లేని వారికి నగదు చెల్లింపులు జరపడం సరికాదు. రైతుకు మద్దతు ధర లభించడం కోసమే ప్రభుత్వం రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది.


ఎఫ్‌సీఐ దగ్గర రెండేళ్లకు సరిపడా బియ్యం నిల్వ ఉన్నా, రైతుకు న్యాయం చేయడం కోసమే బియ్యం కొని, కార్డుదారులకు పంపిణీ చేస్తున్నాం. ఇది రేషన్‌ కార్డుల్లో కోత కాదు. రేషన్‌ వాడుకోని వారు స్వచ్ఛందంగా వెనక్కి ఇస్తే మంచిది. రేషన్‌ షాపుల్లో మిల్లెట్స్‌, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను కూడా పెట్టొచ్చనే ప్రతిపాదనను ప్రభుత్వానికిస్తాం. కమిటీ సలహాను స్వీకరించాలా? లేదా? అన్నది ప్రభుత్వం ఇష్టం’ అని రఘురామ చెప్పారు.

Updated Date - Jun 04 , 2025 | 03:47 AM