Share News

Chevireddy Bhaskar Reddy: పోలీస్ అధికారికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెదిరింపులు..

ABN , Publish Date - Jun 14 , 2025 | 08:31 PM

వైఎస్ జగన్ పొదిలి పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడికి దిగిన వైసీపీ శ్రేణులను పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలో వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Chevireddy Bhaskar Reddy: పోలీస్ అధికారికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెదిరింపులు..
YCP Leader Chevireddy Bhaskar Reddy

ఒంగోలు, జూన్ 14: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలి పర్యటన సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పొదిలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో వారిని పరామర్శించేందుకు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి శుక్రవారం ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారిని కలవకూడదంటూ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి స్థానిక సీఐ వెంకటేశ్వర్లు సూచించారు.

సీఐ వెంకటేశ్వర్లుకి వేలు చూపిస్తూ చెవిరెడ్డి భాస్కరరెడ్డి పైకి వెళ్ళి నిందితులను కలిసేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా తనకూ రూల్స్ అన్ని తెలుసునంటూ పోలీసులతో ఆయన వాగ్వివాదానికి దిగారు. ఆ క్రమంలో పోలీస్‌స్టేషన్‌లో ధర్నా చేస్తానంటూ పోలీసులను చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెదిరింపునకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఒక విధమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతలో అక్కడికి డీఎస్పీ లక్ష్మీ నారాయణ చేరుకున్నారు. దీంతో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రయత్నాన్ని డీఎస్పీ అడ్డుకున్నారు.


పొగాకుకి గిట్టుబాటు ధర లేక ఆ పంటను సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారిని పరామర్శించాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆ క్రమంలో జూన్ 11వ తేదీ ప్రకాశం జిల్లా పొదిలిలో ఆయన పర్యటించారు. అయితే ఇటీవల సాక్షి మీడియాలో చర్చ కార్యక్రమంలో రాజధాని మహిళలను కించపరుస్తూ జర్నలిస్టు కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చ కార్యక్రమానికి కొమ్మినేని శ్రీనివాసరావు యాంకర్‌గా వ్యవహరించారు. ఆయన సైతం ఈ వ్యాఖ్యలను ఖండించ లేదు.


ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై రాజధాని అమరావతి మహిళలు, రైతులు ఆందోళన బాట పట్టారు. అంతేకాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యవహారంపై సాక్షి మీడియా యాజమానిగా వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పి.. ఆ తర్వాత పొదిలిలో పర్యటించాలని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనకు దిగిన వారిపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగాయి. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రాళ్ల దాడికి దిగిన వారిని గుర్తించి.. అరెస్ట్ చేసి పొదిలి పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితులను కలిసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆయన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

ఇవి కూడా చదవండి..

అమరావతిలో మళ్లీ ఆందోళనలు..

మాజీ సీఎం ప్రాణం తీసిన సెంటిమెంట్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 08:31 PM