Minister Kollu Ravindra: పేర్ని పాపం పండింది
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:28 AM
చేసిన పాపాలకు పేర్ని నాని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆయన పాపం పండింది. ఇక వదిలేది లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

చేసిన పాపాల వల్లే నిద్రలేని రాత్రులు.. ఇక వదిలేది లేదు: కొల్లు
మచిలీపట్నం టౌన్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): ‘చేసిన పాపాలకు పేర్ని నాని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆయన పాపం పండింది. ఇక వదిలేది లేదు’ అని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తప్పుడు సర్వే నంబర్లతో దొంగ పట్టాలిచ్చిన మాట వాస్తవమో కాదో అందరికీ తెలుసు. 2023లో బదిలీ అయిన తహసీల్దార్ సునీల్ 2024లో పట్టాలు ఎలా ఇచ్చారు? పేదలపై ప్రేమ ఉంటే టిడ్కో ఇళ్లను ఐదేళ్ల పాటు ఎందుకు పాడు పెట్టారు? కేసుల భయంతో పేర్ని నాని వణికిపోతూ నాపై అసత్య ఆరోపణలకు దిగుతున్నాడు. స్ట్రీట్ ఫీల్డ్(రోడ్డు పక్క స్థలాలు)లో పట్టాలిస్తే తప్పేమిటని ప్రశ్నించడానికి సిగ్గుండాలి. పేదల బియ్యాన్ని పందికొక్కులా బొక్కారు. పేర్ని నాని గిడ్డంగి నుంచి కాకినాడ పోర్టు వరకు వెళ్లిన లారీల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. మాయమైన బియ్యానికి రూ.1.70 కోట్లు ఎందుకు కట్టారు? తప్పు చేసి ఇలా దొరికిపోయారు. అధికారులను బెదిరిస్తూ పేర్ని నాని మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది’ అని మంత్రి కొల్లు అన్నారు.
పోలీసులపై పేర్ని వాఖ్యలు అనుచితం
సీఐను గాడు అనడంపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం
పోలీసు అధికారులపై మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు కె.జయపాల్, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్ ఖాన్ ఖండించారు. సంఘం కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ‘రేషన్ బియ్యం దుర్వినియోగం కేసులో పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను రూరల్ సీఐ దర్యాప్తు జరుపుతున్న సమయంలో ఏ విధంగానూ పరుషంగా మాట్లాడలేదు. అయితే పేర్ని నాని సీఐను గాడు అని ఏకవచనంతో సంబోధించడం, ఒక వాతకు పది వాతలు పెడతానని బెదిరించడం సరికాదు. నాని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని పోలీస్ అధికారుల సంఘం నేతలు అన్నారు.