Terrorism: ఉగ్ర చెరలో పల్నాడు జిల్లా వాసి
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:26 AM
ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లిన పల్నాడు జిల్లా వాసిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

మాలిలో కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులు
రక్షించాలంటూ కుటుంబ సభ్యుల వేడుకోలు
మాచర్ల రూరల్, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లిన పల్నాడు జిల్లా వాసిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉగ్ర చెర నుంచి అతడిని విడిపించి స్వదేశం రప్పించాలని కూటమి ప్రభుత్వాన్ని వారు వేడుకుంటున్నారు. మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన కూరాకుల వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మి దంపతులకు వ్యవసాయమే జీవనాధారం. వారికి కుమారుడు అమరలింగేశ్వరరావుతో పాటు ఇద్దరు కూతుళ్లున్నారు. కుమారుడికి సుమారు 20 యేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడకు చెందిన వెంకటరమణతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం.
అమరలింగేశ్వరరావు పదేళ్ల క్రితం మాలి దేశానికి ఉపాధి కోసం వెళ్లాడు. అక్కడ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. జూలై 1న ఆ ఫ్యాక్టరీలోకి ఉగ్రవాదులు చొరబడి మేనేజర్ను కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో కనిపించిన అమరలింగేశ్వరరావునూ తమతో తీసుకెళ్లారు. సమాచారం అతని కుటుంబ సభ్యులకు శుక్రవారం మధ్యాహ్నం చేరింది. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అమరలింగేశ్వరరావును తిరిగి దేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.