Share News

Ongole Flyover: 10 నిమిషాలు 3 ప్రమాదాలు

ABN , Publish Date - May 05 , 2025 | 03:44 AM

ఒంగోలు వద్ద కొప్పోలు ఫ్లై ఓవర్ సమీపంలో 10 నిమిషాల్లో మూడు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.

Ongole Flyover: 10 నిమిషాలు 3 ప్రమాదాలు

  • అతి వేగానికి ఐదు ప్రాణాలు బలి

  • ఆగివున్న లారీని ఢీకొన్న కోడిగుడ్ల లారీ

  • వెనుకే వచ్చి ఢీకొట్టిన మరో లారీ.. ముగ్గురి మృతి

  • ట్రాఫిక్‌ జామ్‌తో 200 మీటర్ల వరకూ ఆగిన వాహనాలు

  • లారీ వెనుక ఆగివున్న కారుని ఢీకొట్టిన మరో లారీ

  • ఇద్దరి దుర్మరణం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

  • ఒంగోలు వద్ద కొప్పోలు ఫ్లై ఓవర్‌ సమీపంలో ప్రమాదాలు

ఒంగోలు క్రైం, మే 4 (ఆంధ్రజ్యోతి): వేకువజామున అతివేగం... పదంటే పది నిమిషాల్లో మూడు ఘోర ప్రమాదాలకు కారణమైంది. 200 మీటర్ల దూరంలో.. ఒకటి దాని తర్వాత ఒకటి.. వరుసగా మూడు ప్రమాదాలు సంభవించడంతో కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద కొప్పోలు ఫ్లై ఓవర్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచి 4:40 గంటల వ్యవధిలో జరిగిన మూడు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం పాలవగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తొలుత.. కోడిగుడ్ల లోడుతో విజయవాడ వైపు నుంచి నెల్లూరు వైపు వేగంగా వెళ్తున్న లారీ కొప్పోలు ఫ్లైఓవర్‌ దాటిన తర్వాత.. అక్కడ పంక్చర్‌ పడి రోడ్డుపై ఆగి ఉన్న మరోలారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఉదయం 4:30 గంటలకు జరిగింది. మరో ఐదు నిమిషాలకు దానివెనుకే వరికోత మిషన్‌తో వేగంగా దూసుకొచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో కోడిగుడ్ల లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోడిగుడ్ల లారీలో ఉన్న నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్‌ మండలం గుడిపల్లిపాడుకు చెందిన రావినూతల బాబు (42), రావినూతల నాగేంద్ర (18), నెల్లూరు టౌన్‌లోని వెంగళరావునగర్‌కు చెందిన డ్రైవర్‌ షేక్‌ రహీం అలియాస్‌ రమణయ్య (60) అక్కడికక్కడే మృతి చెందారు. వరికోత మిషన్‌తో వెళ్తున్న వాహనంలో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదాలతో రోడ్డుపై ట్రాఫిక్‌ ఆగిపోయింది.


దీంతో వాహనాలు ఒకదాని వెనుక ఒకటి నిలిచిపోయాయి. ఇలా ప్రమాద స్థలానికి 200 మీటర్ల దూరంలో ఓ లారీ.. దాని వెనుక కారు కూడా ఆగాయి. 4:40 గంటల సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ.. ఆగిఉన్న కారుని బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్యలో చిక్కుకున్న కారు నుజ్జునుజ్జయ్యింది. అందులో ఉన్న గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పరావూరుకు చెందిన తిరుమలశెట్టి పావని (42), ఆమె కుమారుడు చంద్రకౌషిక్‌ (16) తీవ్రగాయాలతో ఆస్పత్రిలో కన్నుమూశారు. పావని భర్త వెంకటేశ్వర్లు, ఆమె బంధువులైన బూసి వినయ్‌దేవ్‌, లావణ్య (దంపతులు)తోపాటు వారి కుమారుడు లోక్షిత్‌కు గాయాలయ్యాయి. వినయ్‌దేవ్‌, లావణ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. లోక్షిత్‌ పుట్టెంట్రుకలు తీయించేందుకు తిరుమల వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదానికి ముందు ఐషర్‌ వాహనం ఆగి ఉన్న కారును, మలుపు తిరుగుతున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.


పదిలో 570 మార్కులు.. జీవితంలో నిండిన నూరేళ్లు

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పరావూరుకు చెందిన తిరుమలశెట్టి చంద్రకౌషిక్‌ (16) ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో 570 మార్కులు సాధించాడు. మరో నెలరోజుల్లో కాలేజీ జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో అతన్ని మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో చంద్రకౌషిక్‌ తల్లి తిరుమలశెట్టి పావని కూడా కన్నుమూయడం మరింత విషాదకరం. వారి బంధువులైన వినయ్‌దేవ్‌, లావణ్య దంపతుల రెండేళ్ల కుమారుడు లోక్షిత్‌ చంద్రదేవ్‌కు తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో పుట్టెంట్రుకలు తీయించేందుకు శనివారం రాత్రి వారు కారులో బయల్దేరారు. వారి బంధువులైన తిరుమలశెట్టి వెంకటేశ్వరరావు, పావని దంపతుల ఒక్కగానొక్క కుమారుడు చంద్రకౌషిక్‌ కూడా తిరుపతి వెళ్దామని కోరడంతో అదే కారులో బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు వద్ద రోడ్డు ప్రమాదంలో పావని, చంద్రకౌషిక్‌ మృతి చెందారు.

Updated Date - May 05 , 2025 | 03:46 AM