Naxal Body Cremation: పోలీసుల ఆధ్వర్యంలో.. నంబాల అంత్యక్రియలు
ABN , Publish Date - May 27 , 2025 | 04:08 AM
చత్తీగఢ్లో నక్సల్ నేత నంబాల కేశవరావు సహా ఆరు నక్సల్స్ మృతదేహాలను పోలీసులు బంధుమిత్రుల లేకపోవడంతో తమంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు మరియు ప్రజాసంఘాలు ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

మరో ఐదుగురు నక్సల్స్ మృతదేహాలకూ..
ఎండుకట్టెల మధ్య వేసి కిరోసిన్తో దహనం చేసిన బలగాలు!
బంధుమిత్రులు లేకపోవడంతో.. తామే అంత్యక్రియలు చేశామన్న పోలీసులు
మృతదేహాలను అప్పగించమంటే.. ఇచ్చేది లేదని బెదిరించారు: బంధుమిత్రులు
చర్ల/హసన్పర్తి, మే 26 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతదేహానికి ఛత్తీ్సగఢ్ పోలీసులు అంత్యక్రియలు జరిపారు. అయినవారు మృతదేహాన్ని అప్పగించాలంటూ ఛత్తీ్సగఢ్కు వెళ్లినా.. ప్రజాసంఘాలు డిమాండ్లు చేసినా.. ఆ మేరకు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ స్పష్టమైన హామీ ఇచ్చినా.. నారాయణపూర్ పోలీసులు ఖాతరు చేయలేదు. నంబాలతోపాటు.. మరో ఐదుగురు నక్సలైట్ల మృతదేహాలను సోమవారం దహనం చేశారు. ఆ వీడియోలను మీడియాకు షేర్ చేశారు. నారాయణపూర్ పోలీసు హెడ్క్వార్టర్స్ సమీపంలోని చెట్లు, పొదల మధ్య.. అందుబాటులో ఉన్న ఎండుకర్రలను పేర్చి, వాటి మధ్యలో మృతదేహాలను వేసి.. కిరోసిన్తో నిప్పుపెట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధుమిత్రులకు అప్పగిస్తామంటూ ఛత్తీ్సగఢ్ హైకోర్టుకు ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ శనివారం స్పష్టమైన హామీ ఇచ్చినా.. అయినవారు లేరని చెబుతూ నారాయణపూర్ పోలీసులు ఏకపక్షంగా అంత్యక్రియలు నిర్వహించారు. హనుమకొండ జిల్లా చింతగుట్టకు చెందిన బూర రాకేశ్ అలియాస్ వివేక్(32) మృతదేహం కోసం అతని తండ్రి బూర బాబు, కుటుంబ సభ్యులు ఛత్తీ్సగఢ్కు వెళ్లారు. అయితే.. మృతదేహాలను ఇచ్చేది లేదంటూ నారాయణపూర్ పోలీసులు తేల్చిచెప్పారని వారు వాపోయారు. దాంతో మృతుల బంధుమిత్రులు నారాయణపూర్ ప్రభుత్వాస్పత్రి నుంచి పోలీ్సస్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అయితే.. పోలీసులు మాత్రం ఈ నెల 21న జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది నక్సల్స్ చనిపోయినట్లు చెప్పారు. 20 మంది నక్సల్స్ మృతదేహాలను బంధుమిత్రులకు అప్పగించామని.. ఒక మృతదేహాన్ని నారాయణపూర్లో దహనం చేయడానికి అనుమతించామని చెప్పారు.
మిగతా 6 మృతదేహాల విషయంలో బంధుమిత్రులు, అయినవారు లేకపోవడంతో చట్టపరంగా వాటిని తామే దహనం చేశామని పేర్కొన్నారు. ‘‘కోసి అలియాస్ హంగి అనే మావోయిస్టు బంధుమిత్రులకు మృతదేహాన్ని అప్పగించాం. అయితే.. కుళ్లిపోతున్న ఆ మృతదేహం వల్ల అంటువ్యాధుల ముప్పు ఉందని బంధుమిత్రులు మాకు చెప్పారు. ఈ కారణంతో.. నారాయణపూర్లోనే అంత్యక్రియలకు అవకాశం కల్పించాలని కోరారు. మేము అందుకు అనుమతించాం. మిగతా ఆరు మృతదేహాలను చట్టపరంగా.. నారాయణపూర్ మేజిస్ట్రేట్ ఆదేశాలతో దహనం చేశాం’’ అని నారాయణపూర్ ఎస్పీ కార్యాలయం సోమవారం సాయంత్రం ఓ ప్రకటనను విడుదల చేసింది. అంత్యక్రియలకు సంబంధించిన వీడియోలను మీడియాకు షేర్ చేసింది. అందులో ఎండు కర్రలను కుప్పలుగా పోసి.. అందులో మృతదేహాలను వేసి.. కిరోసిన్తో మంట పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యమం కోసం జీవితాలను త్యాగం చేసిన మావోయిస్టులకు ఇది తీవ్ర అవమానమని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఛత్తీ్సగఢ్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా మృతదేహాలను.. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని దహనం చేశారని వాపోయాయి.
అప్పట్లో ఎత్తుకెళ్లిన ఆయుధాలు
2010లో గవాడి(నారాయణపూర్ జిల్లా), అదే సంవత్సరం ఏప్రిల్లో తాడ్మెట్ల, 2017 బుర్కపాల్(సుక్మా జిల్లా)లో జరిగిన దాడుల్లో మావోయిస్టులు అపహరించిన ఆయుధాల్లో కొన్ని తాజా ఎన్కౌంటర్లో లభ్యమైనట్లు నారాయణపూర్ పోలీసులు తెలిపారు. తాజా ఎన్కౌంటర్లో మూడు ఏకే-47, నాలుగు ఎస్ఎల్ఆర్, ఆరు ఇన్సాస్, ఒక కార్బైన్, ఆరు .303 తుపాకులను, ఒక బీజీఎల్ లాంచర్, రెండు రాకెట్ లాంచర్లు, మూడు 12-బోర్ తుపాకులు, ఒక నాటు పిస్టల్, రెండు భర్మార్లు, పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.