Nara Lokesh: రెడ్ బుక్తో వాళ్లకు వణుకు
ABN , Publish Date - May 30 , 2025 | 03:02 AM
కడప మహానాడులో మంత్రి లోకేశ్ రెడ్బుక్ పేరుతో వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమిగా పనిచేస్తామంటూ ప్రజల మద్దతు కోరారు.

ఒకడికి గుండెపోటు.. ఒకడు బాత్రూమ్లో కాలు జారిపడ్డాడు
ఇంకొకడు ఏమయ్యాడో అందరికీ తెలుసు.. రెడ్ కలర్ చూసినా వాళ్లకు నిద్రపట్టడం లేదు
రెడ్ బుక్ అంటే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలుచేయడమే.. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు
దాని పని అది చేసుకుపోతుంది.. మనం అభివృద్ధి బుక్పై దృష్టిపెడదాం.. ప్రజల కోసం కష్టపడదాం
పద్ధతి ప్రకారం వాళ్ల తప్పులు రుజువు చేయాలి.. దానికి టైం పట్టొచ్చు.. శిక్షలు మాత్రం ఖాయం
విషపు మద్యానికి 30 వేల మంది బలి.. అంతులేని ధనదాహంతో వేల కోట్ల దోపిడీ
రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పోయారు.. మోదీ, పవనన్న, చంద్రన్న జెండాలు
పక్కనపెట్టి కలిసి పనిచేశారు.. కూటమిని ప్రజలు ఆశీర్వదించారు
విడాకులుండవ్.. రాసిపెట్టుకోండి.. రాష్ట్రం బాగుపడాలంటే కలిసి ఉండాల్సిందే
ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే పసుపు సైన్యమే మన బలం
కడప బహిరంగ సభలో మంత్రి లోకేశ్ స్పష్టీకరణ
(మహానాడు ప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి)
అంతులేని ధనదాహంతో విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని ఏరులై పారించి, 30 వేల మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. వేల కోట్లు దోచి, రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పోయారు.వైసీపీ వాళ్లకు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు పడితే.. మేం వచ్చిన తొలిరోజు నుంచే వెయ్యి పెంచి ఇస్తున్నాం. పేదవాళ్లు కడుపు నిండా భోజనం చేయడం జగన్కు ఇష్టం ఉండదు. అందుకే అన్న క్యాంటీన్లను మూయించాడు.
- మంత్రి లోకేశ్
‘రెడ్బుక్ పేరు చెప్పగానే ఒకడికి గుండెపోటు వచ్చింది. మరొకడు బాత్రూమ్లో కాలు జారిపడ్డాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికీ తెలుసు. అర్థమైందా రాజా’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. రెడ్బుక్ అంటే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడమేనన్నారు. ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిని చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పామని.. ఇప్పుడు రెడ్బుక్ అదే చేస్తోందని చెప్పారు. రెడ్ కలర్ చూసినా వాళ్లకు నిద్ర పట్టడం లేదని వైసీపీ నేతలను ఎద్దేవాచేశారు. కడప మహానాడు ప్రాంగణంలో బహిరంగ సభ వేదికపై నుంచి లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడారు. ‘ఒక పద్ధతి ప్రకారం వాళ్లు చేసిన తప్పులను రుజువుచేయాలి. దానికి సమయం పట్టొచ్చు. కానీ శిక్షయితే తప్పదు. రెడ్బుక్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మనం డెవలప్మెంట్ బుక్పై దృష్టి పెట్టాలి..’ అని పిలుపిచ్చారు. ఇంకా ఏమన్నారంటే..
వాళ్లే పారిపోయే పరిస్థితి..
మన జెండా పీకేస్తామన్నారు. వాళ్లే ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకుని పారిపోయే పరిస్థితి.. మన పార్టీని లేకుండా చేస్తామన్నారు.. వాళ్లే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి.. వై నాట్ 175 అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి.. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు.. ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి.. ఏ తప్పూ చేయని మన అధినేత చంద్రబాబును బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడినే ప్యాలెస్లో పెట్టి తాళాలు వేశారు. 2024 ఎన్నికల్లో మాస్ విక్టరీ చూశాం. మనకు అధికారం కొత్త కాదు.. ప్రతిపక్షం కొత్త కాదు. కానీ గత ఐదేళ్లు విధ్వంస పాలనఎదుర్కొన్నాం. మన నాయకులు, కార్యకర్తలపై దాడులు, హత్యలు చేశారు. ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే అరెస్టులు. మన అధినేతను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును చూసినప్పుడు చాలా బాధేసింది. అలిపిరిలో ఆయన్ను చంపేందుకు బాంబు పేల్చారు. ప్రజలకు అండగా నిలిచేందుకు భగవంతుడు ఆయన్ను మన ముందుంచారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే కూటమి
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పడింది. ప్రజల కోసం ప్రధాని మోదీ, జనసేన అధినేత పవనన్న, మన చంద్రన్న జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి కలిసి పనిచేశారు. జనం కూటమిని ఆశీర్వదించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. కూటమి అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు సహజం. చిన్న కుటుంబంలోనే సమస్యలుంటాయి. ఈగోలు పక్కనపెట్టి అందరినీ కలుపుకొని పనిచేయాలి. రాసిపెట్టుకోండి.. కూటమిలో విడాకులు ఉండవు. రాష్ట్రం బాగుపడాలి.. ప్రజలు సంతోషంగా ఉండాలంటే మనం కలిసి ఉండాల్సిందే. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారు. మోదీ అన్ని విధాలా సహకరిస్తున్నారు. గుజరాత్లో బీజేపీ వరుసగా 7 సార్లు గెలిచింది. ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల ఆ రాష్ట్రం ఎంతలా అభివృద్ధి చెందిందో చూడండి. ఒడిసాలో బిజూ జనతాదళ్ వరుసగా ఐదుసార్లు గెలిచింది. ఆ రాష్ట్రం కూడా అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు వరుసగా రెండుసార్లు గెలిచినప్పుడు ఎంతటి అభివృద్ధి సాధించిందో అందరికీ తెలుసు. అందుకే ప్రభుత్వ కొనసాగింపు అనేది ముఖ్యం. పెట్టుబడిదారులకూ నమ్మకం ఉంటుంది.
ఆరు శాసనాలే మన శ్వాస..
కడప మహానాడులో ఏకగీవ్రంగా ఆమోదించిన ఆరు శాసనాలను పొలిట్బ్యూరో సభ్యుడి నుంచి సామాన్య కార్యకర్త వరకు శ్వాసగా భావించి చిత్తశుద్ధితో అమలుకు కృషి చేయాలి. సమస్యలుంటే ఎక్కడివి అక్కడే పరిష్కరించుకోవాలి. స్థానికంగా పరిష్కారం కాకుంటే మా దృష్టికి తెండి. మేం పరిష్కరిస్తాం. యువగళం పాదయాత్ర సమయంలో రాయలసీమ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశాక ఈ కడపగడ్డపైనే మిషన్ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించా. అప్పుడు ఇచ్చిన హామీ అమలు దిశగా చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ర్టానిక్స్, రెన్యువబుల్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం.
వైసీపీ బాధిత కార్యకర్తల కుటుంబాలకు అండ..
దేశంలో ఏ పార్టీ కార్యకర్తలకు ఇవ్వని గౌరవం టీడీపీ ఇస్తోంది. రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తోంది ఒక్క మన పార్టీ మాత్రమే. ఫ్యాక్షన్లో చనిపోయిన కార్యకర్తల పిల్లలు ఫ్యాక్షన్ వైపు వెళ్లకూడదని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటుచేసి చదివించింది మన సీబీఎన్. కేవలం కార్యకర్తల సంక్షేమానికి.. విద్య, వైద్యం, స్వయం ఉపాధి కోసం రూ.140 కోట్లు ఖర్చు చేశారు. నేను స్వయంగా వైసీపీ బాధిత కార్యకర్తల కుటుంబాలను కలుస్తున్నాను. వారి సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తున్నా. వారికి పార్టీ అండగా ఉంటుంది. చంద్రబాబు, నేను ఏ జిల్లాలో పర్యటించినా ముందు ఉత్తమ కార్యకర్తలను కలిశాకే ఇతర కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. సీనియర్లను, జూనియర్లను గౌరవిస్తాను. కానీ పనిచేసేవారిని ప్రోత్సహిస్తాను. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ జగన్ను వాళ్ల పార్టీ కార్యకర్తలు కలవలేరు. టీడీపీ కార్యకర్తల కోసం మా ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అదీ వైసీపీకి, టీడీపీకి మధ్య తేడా. నామినేటెడ్ పదవులన్నీ ఓ పద్ధతి ప్రకారం ఇస్తున్నాం.
దేవుని కడప సాక్షిగా 4 ప్రశ్నలు..
తిరుమల తొలి గడప దేవుని కడప. ఒంటిమిట్ట రామాలయం, అమీన్పీర్ దర్గా, మరియాపురం చర్చి ఉన్న పుణ్యభూమి ఈ కడప. పౌరుషం, ఆత్మీయత, మహిళలను గౌరవించడం ఇక్కడి నుంచే నేర్చుకోవాలి. కడప మాస్ జాతర.. మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోంది. దేవుని కడప సాక్షిగా ఇక్కడి ప్రజలను నాలుగు ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. 1. తల్లిని, చెల్లిని మెడపట్టి బయటకు గెంటిందెవరు? 2. సొంత బాబాయిని గొడ్డలిపోటుతో లేపేసిందెవరు? 3. జే-బ్రాండ్తో పేదల రక్తం తాగిందెవరు? 4. బల్లకింద రెడ్ బటన్ నొక్కి ప్రజలను బాదింది ఎవరు?
సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆరే
ఎన్టీఆర్ అంటే మూడక్షరాలు కాదు.. ఓ ప్రభంజనం. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావడం ఓ చరిత్ర. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. సినిమా స్ర్కీన్ అయినా, పొలిటికల్ స్ర్కీన్ అయినా ఆయనే లెజెండ్. ఆయనే రాముడు, కృష్ణుడు, భీముడు, అర్జునుడు, కర్ణుడు.. ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు. తెలుగువారిని ప్రపంచ పటంలో పెట్టింది మన బ్రాండ్ సీబీఎన్. అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ.. అప్పుడు హైటెక్ సిటీ, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ.. అప్పుడు సైబరాబాద్, ఇప్పుడు అమరావతి.. అప్పుడు రూ.200 పెన్షన్, ఇప్పుడు రూ.4వేలు చేసింది మన సీబీఎన్. సీబీఎన్ అంటే డెవలెప్మెంట్.. సీబీఎన్ అంటే సంక్షేమం.. సీబీఎన్ అంటే మానవత్వం.