Mark Shankar Pawanovich: మార్క్ శంకర్ ఆరోగ్యంపై కీలక అప్ డేట్
ABN , Publish Date - Apr 10 , 2025 | 07:45 PM
Mark Shankar Pawanovich: స్కూలులో జరిగిన అగ్ని ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై మెగస్టార్ చిరంజీవి కీలక అప్ డేట్ ఇచ్చారు.

హైదరాబాద్, ఏప్రిల్ 10: సింగపూర్ స్కూల్లోని తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. గురువారం సింగపూర్లో చిరంజీవి మాట్లాడుతూ.. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడన్నారు. అయితే బాబు ఇంకా కోలుకావాల్సి ఉందని పేర్కొన్నారు.
మా కులదైవం అంజనేయస్వామి దయతో.. కృపతో త్వరలోనే కోలుకొని పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ మాములుగా ఎప్పటిలాగే బాబు ఉంటాడన్నారు. శుక్రవారం..అంటే ఏప్రిల్ 11వ తేదీ హనుమన్ జయంతి అని ఈ సందర్భంగా చిరంజీవి గుర్తు చేశారు. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడని అన్నారు.
మార్క్ శంకర్ కోలుకోవాలని.. వివిధ ప్రాంతాల్లోని పలు ఊళ్లలో.. ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారని.. ఆశీస్సులు అందజేస్తున్నారని చెప్పారు. ఇలా తమ కుటుంబానికి అండగా నిలబడి.. వారందరికి నా తరఫున, తమ్ముడు పవన్ కల్యాణ్ తరఫున, మా కుటుంబం యావన్మంది తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారికంగా పర్యటించారు. ఆ సమయంలో సింగపూర్లో ఆయన కుమారుడు మార్క్ శంకర్ చదువుతోన్న స్కూల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందంటూ సమాచారం అందింది. ఈ ప్రమాదంలో అతడికి కి కాళ్లు, చేతులకు గాయాలైనట్లు పవన్ కళ్యాణ్కు సమాచారం అందింది.దీంతో ఆయన సింగపూర్ వెళ్లాలని నిర్ణయించారు. ఆ క్రమంలో పెద్ద సోదరుడు చిరంజీవి దంపతులుతోపాటు పవన్ కల్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News