AP Govt: మాతృత్వ సెలవులు ఇక 180 రోజులు
ABN , Publish Date - May 06 , 2025 | 03:19 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల మాతృత్వ సెలవులను 120 నుంచి 180 రోజులకు పెంచింది. ఇద్దరు పిల్లల పరిమితిని తొలగిస్తూ, ఎక్కువ పిల్లలకు కూడా ఈ లీవ్ వర్తించేలా జీవో సవరణ చేసింది,

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలకూ వర్తింపు
ఇప్పటిదాకా ఆ సెలవులు 120 రోజులే
మెటర్నిటీ లీవుల జీవోను సవరించిన ప్రభుత్వం
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాతృత్వ సెలవుల (మెటర్నిటీ లీవులు)ను మరో 60 రోజులు పెంచడమే కాకుండా, ఇద్దరు పిల్లల వరకే వర్తింపు అనే నిబంధనను కూడా తొలగించింది. ప్రస్తుతం 120 రోజులుగా ఉన్న ఈ సెలవులను 180 రోజులకు పెంచింది. అలాగే ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కన్నా కూడా ఈ పెంపుదల వర్తించేలా మాతృత్వ సెలవుల నిబంధనలు సవరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎ
క్కువ మంది పిల్లల్ని కనాలంటూ రాష్ట్రంలోని దంపతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతున్నారు. ఒక్కరితోనో, ఇద్దరు పిల్లలతోనో సరిపెట్టుకోవద్దు. అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండంటూ ఆయన పదే పదే కోరుతున్నారు. జనాభా తగ్గిపోతే అభివృద్ధి కుంటుబడిపోతుందని వివరిస్తున్నారు. జనాభా పెరుగుదలకు అడ్డంకిగా ఉన్న స్థానికసంస్థల చట్టంలోని.. ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ ఉండకూడదు అనే నిబంధనను కూడా ఇటీవల సవరించారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా పోటీకి అర్హులే అంటూ కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఆ విధంగానే మాతృత్వ సెలవులను కూడా పెంచారు. ఇద్దరికే వర్తింపు అనే నిబంధన కూడా సవరించారు.
జనాభాతోనే సంపద..
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్న విషయం తెలిసిందే. జనాభా పెరిగితేనే సంపద పెరుగుతుందని, దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపించే యువ జనాభా తగ్గిపోతే ఇబ్బందులు తప్పవని ఇటీవల చంద్రబాబు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తావన, స్వర్ణాంధ్ర - 2047 విజన్ డాక్యుమెంట్ వచ్చినప్పటి నుంచి జనాభా ప్రాముఖ్యం గురించి అనేక సందర్భాల్లో చెప్పారు. యువత సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగిపోతే రాష్ట్రం, దేశం వృద్ధిలో వెనుకబడిపోతాయని, జపాన్, చైనా వంటి దేశాలు ఈ సమస్యతో ప్రస్తుతం పోరాడుతున్నాయని పేర్కొన్నారు.
భారత రిజిస్ట్రార్ జనరల్ గణాంకాల ప్రకారం 2001లో వృద్ధుల జనాభా 12.6 శాతం ఉండగా, 2011లో 15.4 శాతం, 2021లో 18.5 శాతం ఉంది. అది 2031 నాటికి 24.7 శాతానికి పెరగొచ్చని అంచనాలున్నాయి. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1992-93లో 2.6 శాతం ఉండగా, 2019-21 నాటికి అది 1.7 శాతానికి తగ్గింది. ఈ క్షీణత ఇలాగే కొనసాగితే ప్రపంచంతో రాష్ట్రం, దేశం పోటీ పడలేవని, అందుకే జనాభాను పెంచుకునే అవసరం ఉందని చెబుతున్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం వైపునుంచి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు.