JEE Advanced 2025: మన్యం బిడ్డకు 21వ ర్యాంకు
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:12 AM
పార్వతీపురం మన్యం జిల్లా గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్చంద్ర జేఈఈ అడ్వాన్స్డ్లో ఆలిండియా 21వ, ఓబీసీ కేటగిరీలో 2వ ర్యాంకు సాధించి విశేష విజయం సాధించాడు. విజయనగరం జిల్లాకు చెందిన మరికొందరు విద్యార్థులు కూడా జేఈఈలో ఉత్తమ ప్రతిభ చూపించారు.

(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్)
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మన్యం బిడ్డ మెరుపులు కురిపించాడు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్చంద్ర ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 21వ ర్యాంకు, ఓబీసీ కోటాలో 2వ ర్యాంకు సాధించాడు. జేఈఈ మెయిన్స్-2025లో ఆలిండియా 121వ ర్యాంకు, ఓబీసీ కోటాలో 17వ ర్యాంకు పొందాడు. ఐఐటీ-ముంబైలో కంప్యూటర్ సైన్స్ చేయడం తన లక్ష్యమని భరత్చంద్ర తెలిపాడు. కాగా, భరత్చంద్ర తండ్రి రామకృష్ణ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని మెరైన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు.
జేఈఈ ‘విజయ’నగరం!
విజయనగరం జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బొబ్బిలికి చెందిన ఆనంద చక్రవర్తి ఆలిండియా స్థాయిలో 118వ ర్యాంక్ సాధించాడు. రామభద్రపురం మండలం ఆరికతోట గ్రామానికి చెందిన జాగాన యోగేశ్వర్ 284వ ర్యాంకు సాధించాడు. బొబ్బిలి నాయుడు కాలనీకి చెందిన పొట్నూరు కార్తీక్ ఆలిండియా స్థాయిలో 419 వ ర్యాంకు సాధించాడు. మెంటాడ మండలం పిట్టాడ గ్రామానికి చెందిన రొంగళి కార్తీక్ ఆల్ ఇండియా 526వ ర్యాంక్ పొందారు. రేగిడి మండలం కందిశకి చెందిన మీసాల పవన్కుమార్నాయుడు 750వ ర్యాంకు సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని వడమ కాలనీలో నివాసం ఉంటున్న కొరికాన రసజ్ఞకు జేఈఈ అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా 78 ర్యాంకు దక్కింది. గరుగుబిల్లి మండలం గొట్టివలసకు చెందిన బోను చాణక్య ఓపెన్ కేటగిరీలో 550 ర్యాంకు, పార్వతీపురం పట్టణానికి చెందిన ద్వారపురెడ్డి బలరాంనాయుడు ఓపెన్లో 633వ ర్యాంకు సాధించారు.