Share News

TDP Leaders: మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు

ABN , Publish Date - Jun 08 , 2025 | 03:53 AM

రాజధాని ప్రాంత మహిళలను కించపరుస్తూ జగన్‌ చానల్‌లో పాత్రికేయుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ద్వేషంతో మహిళలను అవమానించడం వైసీపీ దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని మంత్రి లోకేశ్‌ మండిపడ్డారు.

TDP Leaders: మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు

  • జగన్‌ గ్యాంగ్‌ని ఎట్టిపరిస్థితుల్లో క్షమించం: మంత్రి లోకేశ్‌

  • వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇల్లు ఎక్కడుంది?: గొట్టిపాటి

  • ఆడబిడ్డలను అవమానించిన వారిని ఉపేక్షించొద్దు: అనగాని

  • క్షమాపణ చెప్పకుంటే మహిళా లోకం తిరగబడుతుంది: కొలుసు

అమరావతి, నూజివీడు, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంత మహిళలను కించపరుస్తూ జగన్‌ చానల్‌లో పాత్రికేయుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ద్వేషంతో మహిళలను అవమానించడం వైసీపీ దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని మంత్రి లోకేశ్‌ మండిపడ్డారు. ‘మహిళలను అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే అది మీ మీదే పడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలె్‌సలోనే పడుతుంది. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే. భూములు త్యాగాలు చేసిన అమ్మల అమరావతి. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే.. జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని. కన్న తల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుంది? అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళాలోకాన్ని కించపరిచిన జగన్‌ గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించం. జగన్‌రెడ్డి బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే దేవతల రాజధాని అమరావతి... దెయ్యం జగన్‌ పని పడుతుంది’ అని లోకేశ్‌ హెచ్చరించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘రాజధాని మహిళల్ని కించపరచేలా వైసీపీ పేటీఎం బ్యాచ్‌ మాట్లాడుతోంది. జగన్‌ ఇల్లు ఎక్కడుంది? రాజధాని మహిళలను కించపరచేలా మాట్లాడుతున్న వైసీపీ నేతలు తినేది అన్నమేనా లేదా ఇంకేదైనానా? పనికిమాలిన బ్యాచ్‌తో ఇంకెంతకాలం అమరావతిపై విషప్రచారం సాగిస్తారు? తలాతోకా లేకుండా అర్థం లేని వ్యాఖ్యలతో మహిళల్ని కించపరచే మీరు మనుషులేనా?’ అని గొట్టిపాటి మండిపడ్డారు.


మంత్రి కొలుసు పార్థసారథి ఓ ప్రకటన చేస్తూ... ‘రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం సిగ్గు చేటు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వారి మాటలు వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సాక్షి పత్రికపై, కృష్ణంరాజుపై తిరుగుబాటు తప్పదు. కృష్ణంరాజును మహిళలు తరిమి, తరిమి కొడతారు’ అని హెచ్చరించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ, ‘రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా మాట్లాడటం నీచాతినీచం. ఆడబిడ్డలను అవమానించిన వారిని ఉపేక్షించకూడదు’ అని అన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందిస్తూ... ఆడబిడ్డలందరినీ ఘోరంగా అవమానించేలా వ్యాఖ్యలు చేయించడం వైసీపీ చెత్త రాజకీయాలకు నిదర్శనం’ అని వివర్శించారు.

కొమ్మినేని, కృష్ణంరాజుపై చర్యలు తీసుకోండి డీజీపీకి డిప్యూటీ స్పీకర్‌ రఘురామ లేఖ

రాష్ట్ర రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అంటూ వ్యాఖ్యానించిన జర్నలిస్టు కృష్ణంరాజు, ఆ కార్యక్రమ నిర్వాహకుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈమేరకు ఆయన శనివారం డీజీపీకి లేఖ రాశారు. మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు కొమ్మినేని, కృష్ణంరాజుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ఆ కార్యక్రమాన్ని టెలీకాస్ట్‌ చేసిన జగన్‌ మీడియాపైనా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా మహిళల గౌరవాన్ని, అమరావతి ప్రతిష్ఠను కాపాడాలని లేఖలో డిప్యూటీ స్పీకర్‌ కోరారు.

Updated Date - Jun 08 , 2025 | 03:54 AM