LG Powers Andhra: ఏపీలో ఎల్జీ అడుగు
ABN , Publish Date - May 09 , 2025 | 04:10 AM
కోరియా దిగ్గజం ఎల్జీ శ్రీసిటీలో ₹5,800 కోట్ల పెట్టుబడితో భారీ తయారీ పరిశ్రమను ప్రారంభించనుంది. మంత్రి లోకేశ్ భూమిపూజ చేయగా, ఈ ప్రాజెక్టుతో ఏపీ ఎలక్ట్రానిక్స్ హబ్గా ఎదగనుంది

రూ.5 వేల కోట్లతో భారీ పరిశ్రమ ఏర్పాటు
శ్రీసిటీలో యూనిట్కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
రాష్ట్ర భవిష్యత్కు పునాదులు.. ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్గా ఏపీ
మేడిన్ ఆంధ్రా నుంచి మేడ్ ఫర్ వరల్డ్ వరకు జైత్రయాత్ర
యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం: లోకేశ్
చంద్రబాబు సహకారంతో ఏపీకి కొరియా కంపెనీలు
గతంలో కియ, ఇప్పుడు ఎల్జీ రాక: కొరియా రాయబారి
తయారీ పరిశ్రమలకు హబ్గా ఏపీకి ఇది ప్రారంభం: సీఎం
సత్యవేడు/అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ.. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో భారీ పరిశ్రమ స్థాపించడానికి శ్రీకారం చుట్టింది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఆ కొరియా సంస్థ రూ. 5 వేల కోట్లకుపైగా పెట్టుబడితో పరిశ్రమను నిర్మిస్తోంది. దీనికి గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సృష్టించే ప్రతి ఉద్యోగం, ప్రతి ఆవిష్కరణ ద్వారా ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్గా మార్చేందుకు తమ ప్రభుత్వం బాటలు వేస్తోందన్నారు. ఇవాళ తాము ఎల్జీ యూనిట్కు మాత్రమే కాకుండా, ఏపీ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామని అన్నారు. రాష్ట్రంతో పాటు దేశ పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక పురోగతిలో ఈ శంకుస్థాపన ఓ మైలురాయి అని అభివర్ణించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంతో ఏర్పాటవుతున్న తొలి పరిశ్రమ ఎల్జీయేనని చెప్పారు. ఏపీని ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రపంచ స్థాయి కేంద్రంగా మార్చాలనే తమ ఆశయాన్ని ఎల్జీ సంస్థ ముందుకు తీసుకువెళుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతోందన్నారు. మేడిన్ ఆంధ్రా నుంచి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకూ రాష్ట్ర జైత్రయాత్ర కొనసాగుతుందన్నారు. ఏపీ భవిష్యత్తుపై చంద్రబాబు నిబద్ధతతకు ఈ పరిణామాలు అద్దంపడుతున్నాయని చెప్పారు. భారత్లో కొరియా రాయబారి లీ సియాంగ్ మాట్లాడుతూ, గతంలో సీఎం చంద్రబాబు సహకారంతో ఏపీలో తమ దేశానికి చెందిన కియా కంపెనీ ఏర్పాటైందని, ఇపుడు ఎల్జీ వస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్, ఆ సంస్థ హోమ్ సొల్యూషన్స్ సీఈవో జేచియోల్ లియు, ఎకో సొల్యూషన్స్ సీఈవో జే సంగ్లీ, సత్యవేడు, శ్రీకాళహస్తి, నగరి, చంద్రగిరి ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, బొజ్జల సుధీర్రెడ్డి, గాలి భానుప్రకాష్, పులివర్తి నాని, సీడాప్ చైర్మన్ దీపక్రెడ్డి, జడ్పీ చైర్మన్ జి.శ్రీనివాసులు, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అభిషిక్త కిశోర్, కాన్సులేట్ జనరల్ (ఏపీ, తెలంగాణ) చుక్కపల్లి సురేష్, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, శ్రీసిటీ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.
సంప్రదాయం పాటించిన కొరియన్లు
భూమిపూజ కార్యక్రమం సందర్భంగా ఎల్జీ పరిశ్రమ కొరియన్ ప్రతినిధులు షూస్ ధరించే భూమిపూజ జరుగుతున్న ప్రదేశానికి వచ్చారు. అది గమనించిన మంత్రి లోకేశ్ ఆ షూస్ తీసేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ కొరియన్ ప్రతినిధులు తమ షూస్ తీసేసి భూమిపూజలో పాల్గొన్నారు.
రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కొత్త అధ్యాయం: సీఎం చంద్రబాబు
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ రాష్ట్రానికి రావడం చాలా సంతోషాన్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో ఇది కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించనుందని తెలిపారు. ఈమేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ రూ. 5,800 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుందన్నారు. ఏపీ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా తయారుకావడానికి ఇది ప్రారంభమన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు 100 శాతం ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
దేశంలో మూడో ప్రాజెక్ట్
శ్రీసిటీలో ప్రారంభమయ్యే ప్లాంట్కు ఎల్జీకి మూడోది. దేశంలో నోయిడా, పుణెల్లో ఆ సంస్థకు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. శ్రీసిటీలో ఎల్జీకి 247 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ నిర్మిస్తున్న ప్లాంట్లో ఏటా 15 లక్షల ఏసీలు, 8 లక్షల రిఫ్రిజిరేటర్లు, 8.5 లక్షల వాషింగ్ మెషీన్లు, 20 లక్షల ఏసీ కంప్రెసర్లు ఉత్పత్తి కానున్నాయి. వచ్చే ఏడాది ఆఖరుకు ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. 2029 నాటికి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో.. రూరల్ టూరిజం ప్రమోట్..
ఆపరేషన్ సిందూర్పై చైనా, అమెరికా స్పందన
For More AP News and Telugu News