Tiruvuru Political Clash: తిరువూర్లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
ABN , Publish Date - May 20 , 2025 | 03:13 PM
Tiruvuru Political Clash: తిరువూరుకు దేవినేని అవినాష్ రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

ఎన్టీఆర్ జిల్లా, మే 20: తిరువూరులో (Tiruvuru) హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులను, కార్యకర్తలను కవ్వించే విధంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ వ్యవహరించారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు అనుచరగణంతో విజయవాడ నుంచి తిరువూరు వచ్చారు దేవినేని అవినాష్. విషయం తెలిసిన వెంటనే దేవినేని అవినాష్ను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులకు, టీడీపీ నాయకులకు మధ్య తీవ్రస్దాయిలో వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రేపూడి వద్ద దేవినేని అవినాష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైలవరం పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే పోలీస్స్టేషన్కు తరలించే క్రమంలో అవినాష్పై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు.
తిరువూరు నగర పంచాయతీ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ నుంచి తిరువూరు వచ్చిన దేవినేని అవినాష్.. వైసీపీకి చెందిన కొంత మంది సభ్యులను ఎన్నికకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారంటూ టీడీపీ నేతలు, సభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ స్వచ్ఛందంగా వస్తున్న సభ్యులను అడ్డుకుంటున్నారని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. దేవినేని అవినాష్ తన అనుచరగణంతో వస్తున్నట్లు తెలుసుకున్న టీడీపీ నేతలు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, దేవినేని అవినాష్ను రోడ్డు మీదే అడ్డుకుని.. వెనక్కి వెళ్లాల్సిందిగా తెలుగు దేశం శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని టీడీపీ, వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. దేవినేని అవినాష్తో పాటు ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి తర్వాత ఇరువురిని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
టీడీపీకి సంఖ్యా బలం లేకుండా పోటీకి దిగారని, ఇది ఎలా సాధ్యమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీ సభ్యులు తమకు అనుకూలంగా ఉన్నారని, ఎన్నికకు వస్తున్న వారిని అడ్డుకుని దాచిపెడుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా.. తిరువూరులో ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తిరువూరు పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తును కల్పించారు. మరోవైపు.. తిరువూరు నగర పంచయతీ ఉప ఎన్నిక ఈరోజు కూడా కోరం లేక వాయిదా పడింది. మళ్లీ ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఉన్నతాధికారులను అడిగి వెల్లడిస్తామని ఆర్డీవో మాధురి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
Notice To KCR: కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
Vizianagaram Terror Case: పేలుళ్ల కుట్ర కేసు.. వెలుగులో సంచలన విషయాలు
Read Latest AP News And Telugu News