AP News: తల్లికి వందనం పథకానికి జీవో జారీ
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:07 AM
Thalliki Vandanam Scheme: సూపర్ సిక్స్ హామీల్లో మరో కీలక పథకం అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. గురువారం తల్లుల ఖాతాల్లో నగదు జమ..

Amaravati: తల్లికి వందనం పథకం (Thalliki Vandanam Scheme) నిధులు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం (Kutami Govt) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 27 (GO MS No. 27) రూపంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో 67,27,164 మంది విద్యార్థులకు రూ. 15 వేలు చొప్పున జమ చేయనున్నారు. ఈ రూ. 15 వేలల్లో 2 వేల రూపాయలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాలకు మళ్లించి పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి, పారిశుద్ధ్యం కోసం వినియోగించాలని ఆదేశాల్లో వెల్లడించారు. తల్లికి వందనం నిధులను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరో కీలక పథకం అమలు..
కాగా సూపర్ సిక్స్ హామీల్లో మరో కీలక పథకం అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున నిధులు విడుదల చేయనుంది. మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లులకు రూ.8,745 కోట్లు గురువారం జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి రూ.1,000, పాఠశాల నిర్వహణ నిధి కోసం మరో రూ.1,000 చొప్పున మినహాయించి మిగిలిన రూ.13 వేలు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలన్నారు. పథకానికి నిధుల ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను సీఎం ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటో తరగతిలో, ఇంటర్ ఫస్టియర్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని స్పష్టం చేశారు. పథకం అమలులో ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సాంకేతిక కారణాలతో ఎవరైనా విద్యార్థుల పేర్లు లేకపోతే దరఖాస్తుకు అవకాశం కల్పించి, నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వం చివరిసారిగా 2023లో ‘అమ్మ ఒడి’ పథకం అమలు చేసింది. అప్పట్లో 83,15,341 మంది విద్యార్థులకు సంబంధించి 42,61,965 మంది తల్లులకు రూ.6,392.94 కోట్లు విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి:
బంగారు భవిష్యత్ దిశగా ఏపీ అడుగులు
కాలేశ్వరం ఈఈ రిమాండ్కు తరలింపు..
For More AP News and Telugu News