Women Protest: ఆగ్రహావేశాలు.. సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - Jun 09 , 2025 | 01:56 PM
Women Protest: విజయవాడలోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం ముట్టడికి కూటమి మహిళా నేతలు, రాజధాని మహిళలు యత్నించారు.

విజయవాడ, జూన్ 9: సాక్షి డిబేట్లో రాజధాని మహిళలను ఉద్దేశించి వాడిన అసభ్యపదజాలాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పార్టీల మహిళలతో పాటు రాజధాని ప్రాంత మహిళలు రోడెక్కి ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ డిబేట్లో అసభ్య పదాలు వాడినప్పటికీ పశ్చాత్తాపంతో క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చ గొట్టే విధంగా డిబేట్ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడం, అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఉద్యమాలు మొదలయ్యాయి.
ఇందులో భాగంగా ఈరోజు (సోమవారం) విజయవాడ ఆటోనగర్లో సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూటమి పార్టీల మహిళలు, రాజధాని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. సాక్షి డిబేట్లో అమరావతి మహిళల గురించి చేసిన వ్యాఖ్యలపై వారు ఆందోళనకు దిగారు. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాక్షి కార్యాలయం బోర్డును మహిళా నేతలు పీకేశారు. ఆపై కోడిగుడ్లను విసిరారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పటమట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా కూటమి పార్టీల మహిళలు మీడియాతో మాట్లాడుతూ.. సాక్షిని అడ్డం పెట్టుకుని మహిళలపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. రాజకీయ కారణాలకు మహిళలపై నోరు పారేసుకుంటారా అంటూ మండిపడ్డారు. కించపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రాజధాని ప్రాంతంలో ఉన్న భారతీరెడ్డి కూడా ఆ కోవకే చెందినదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడైనా సాక్షి యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని.. డిబేట్లో పాల్గొన్న ఇద్దరినీ శిక్షించాలని కూటమి పార్టీల మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్
గంటన్నరగా విచారణ.. ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం
Read Latest AP News And Telugu News