Share News

Liquor scam case: మద్యం కుంభకోణం కేసు.. రంగంలోకి ఈడీ

ABN , Publish Date - May 28 , 2025 | 11:56 AM

ED investigation: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణ కీలక దశకు చేరింది. ముడుపులు ఎవరికి చేరాయో తెలుసుకునేందుకు సిట్, ఈడీ కలిసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి.

Liquor scam case: మద్యం కుంభకోణం కేసు.. రంగంలోకి ఈడీ
Enforcement Directorate

విజయవాడ: గత ప్రభుత్వం (YCP Govt) (జగన్ సర్కార్)లో జరిగిన మద్యం కుంభకోణం కేసు (Liquor scam case) విచారణ (Investigation) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) ప్రారంభించింది. బుధవారం ఉదయం ఈడీ అధికారులు జిల్లా జైలుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా జైలులో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Rajasekhar Reddy)ని విచారిస్తున్నారు. అతని నుంచి స్టేట్ మెంట్ రికార్డు (Statement Record) చేసుకునేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బు ఎలా మళ్లించారు.. ఎవరెవరి ద్వారా ఎప్పుడెప్పుడు ఈ‌ నగదు చేతులు మారిందనే అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఈడీ బృందం.. సిట్ అధికారులను కలిసి కేసు వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. ఇక నుంచి ఈ కేసులో పరస్పరం సహకారం తీసుకోవాలని ఈడీ, సిట్ అధికారులు నిర్ణయించారు.


అంతిమంగా ముడుపులు ఎవరికి చేరాయో తేలిపోయింది..

కాగా మద్యం స్కామ్‌లో కింగ్‌పిన్‌గా భావిస్తున్న ఏ-1 రాజ్‌ కసిరెడ్డితో పాటు ఇతర నిందితులు, మద్యం వ్యాపారులు, మాజీ అధికారులు సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ముడుపులు అంతిమంగా ఎవరికి చేరాయో తేలిపోయింది. అయితే ఇందుకు పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంది. రాజ్‌ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న క్యాష్‌ హ్యాండర్లు సేకరించిన ముడుపులు ఎన్ని దశలు దాటి ఎవరికి చేరాయనే విషయం ఇటీవల అరెస్టు చేసిన ముగ్గురు కీలక వ్యక్తుల విచారణలో తేలింది. తాడేపల్లి ప్యాలెస్‌లో ఐదేళ్ల పాటు తిరుగులేని హవా నడిపించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి, మాజీ సీఎం జగన్‌ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌ రెడ్డి, భారతీ సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పను సిట్‌ విచారించింది. సిట్‌ సేకరించిన వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది.

Also Read: టీడీపీ అధ్యక్షునిగా చంద్రబాబు పేరు ప్రకటన


కీలక దశకు విచారణ...

గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో విచారణ కీలక దశకు చేరుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుల అరెస్టులు, విచారణ చేయగా.. ముడుపులు ఎక్కడికి చేరాయి.. ‘అంతిమ లబ్ధిదారు’ ఎవరు.. అనేది పక్కా ఆధారాలతో సహా తేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. ఈ కేసు విచారణలో పరస్పరం సహకారం అందించుకోవాలని సిట్‌, ఈడీ నిర్ణయించాయి. 3,500 కోట్ల రూపాయల స్కామ్‌లో పేద ప్రజల నుంచి పిండుకుని దాచుకున్న అసలు దొంగకు ఉమ్మడిగా ఉచ్చు బిగించేందుకు సిద్ధమవుతున్నాయి. మంగళవారం విజయవాడలోని ‘సిట్‌’ కార్యాలయంలో ఈ దిశగా కీలక ముందడుగు పడింది. సిట్‌ బృందంతో ఈడీ అధికారులు భేటీ అయ్యారు. ఈ కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు, అక్రమాలు జరిగిన తీరుపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. ముడుపులు సేకరించిన తీరు మొదలుకొని వాటిని మళ్లించిన దారుల వరకు సిట్‌ అధికారులు ఈడీకి వివరించారు. డిస్టిలరీస్‌ నుంచి తీసుకున్న కమీషన్లు ఏ రూపంలో ఎంత.. ఏ కంపెనీ ఎవరెవరికి ఎంత చేర్చింది.. అనే వివరాలు అందించారు. ప్రమోషనల్‌ గూడ్స్‌ రూపంలో హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీలోని హవాలా ఆపరేటర్ల ద్వారా మనీలాండరింగ్‌ జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఉమ్మడి దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇటీవల ముంబైలో సిట్‌ అధికారులకు ఈడీ అధికారులు సహకరించారు. అలాగే ముడుపులు చేరిన మార్గం, అంతిమ లబ్ధిదారుడి గుట్టు రట్టు చేసేందుకు ఇప్పుడు సహకరించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్టీఆర్‌‌కు సీఎం చంద్రబాబు ఘనంగా నివాళి

టీడీపీ చీఫ్‌గా చంద్రబాబు 30 ఏళ్లు పూర్తి

For More AP News and Telugu News

Updated Date - May 28 , 2025 | 11:56 AM