Share News

Amaravati Women Case: పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

ABN , Publish Date - Jun 09 , 2025 | 11:08 AM

Amaravati Women Case: అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానల్‌కు చెందిన కొమ్మినేని శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Amaravati Women Case: పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్
Amaravati Women Case

అమరావతి , జూన్ 9: అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానల్‌కు చెందిన కొమ్మినేని శ్రీనివాస్ రావును (Journalist Kommineni Srinivas Rao) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్ రావు, జర్నలిస్టు కృష్ణం రాజుపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం సాక్షి ఛానెల్‌లో జరిగిన డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణం రాజు.. అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి.


మహిళా సంఘాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. మహిళలను కించపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు ర్యాలీలు నిర్వహించారు. పలు పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలోని మహిళలు ఈ వ్యాఖ్యలు చేసిన రోజే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. వెంటనే కొమ్మినేని శ్రీనివాస్‌, జర్నలిస్ట్ కృష్ణంరాజు ఇరువురిని అరెస్ట్ చేయాలంటూ తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను సమర్థించే విధంగా కొమ్మినేని మాట్లాడారని రాజధాని మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన పోలీసులు.. సాక్షి ఛానల్‌లో వచ్చిన డిబేట్‌ను కూడా పరిశీలించారు. అనంతరం కేసును నమోదు చేశారు.


ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంతో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అన్నీ కూడా నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న (ఆదివారం) సాయంత్రం తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు రిజిస్టర్ అయ్యింది. వెంటనే ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్‌కు చేరుకుని ఈరోజు ఉదయం ఆయన నివాసంలోనే కొమ్మినేని శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలిస్తున్న పోలీసులు.. అక్కడి నుంచి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లనున్నారు. అనంతరం గుంటూరు కోర్టు లేదా, మంగళగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.


కృష్ణంరాజు కోసం వేట

మరోవైపు జర్నలిస్టు కృష్ణం రాజు ఇంటికి విజయవాడలో తాళం వేసి ఉండటంతో ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయన కోసం విజయవాడ, తుళ్లూరు నుంచి ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్‌కు వెళ్ళాయి. ఈరోజు సాయంత్రంలోగా కృష్ణం రాజును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ నేటికి క్షమాపణ చెప్పని ఇరువురు జర్నలిస్టులపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి ఛానల్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏ3గా సాక్షి ఛానల్ యాజమాన్యం, ఏ1గా కృష్ణం రాజు, ఏ2గా కొమ్మినేనిని పోలీసులు చేర్చారు.


ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మహిళా సంఘాలు, వివిధ రాజకీయపక్షాలకు అనుబంధంగా ఉన్న మహిళా సంఘాలు, రాజకీయ పక్షాల నేతలు పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి మహిళపై వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

యోగాకు పెరుగుతున్న ఆదరణ: కలెక్టర్ లక్ష్మీ శా

మస్క్‌ను కలవరపెడుతున్న మరో సమస్య.. మస్క్‌కు సూర్యుడి దెబ్బ..

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 02:45 PM