CPM On Maredumilli Encounter: న్యాయ విచారణ జరపాల్సిందే... సీపీఎం డిమాండ్
ABN , Publish Date - Nov 19 , 2025 | 03:42 PM
మారేడుమిల్లిలో వరుసగా జరిగిన ఎన్కౌంటర్లపై సీపీఎం నేత శ్రీనివాసరావు స్పందించారు. బూటకపు ఎన్కౌంటర్లు అంటూ వార్తలు వస్తున్నాయన్నారు.
విజయవాడ, నవంబర్ 19: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో నిన్న, ఈరోజు జరిగిన వరుస ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (CPM Leader Srinivasa Rao) డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి, అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు అన్యాయంగా బూటకపు ఎన్కౌంటర్ చేశారని వార్తలు వచ్చాయన్నారు. చట్ట విరుద్ధమైన బూటకపు ఎన్కౌంటర్లను సీపీఎం ఖండిస్తుందని తెలిపారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి నగరాల్లో పోలీసులు దాడులు చేసి 50 మందికి పైగా మావోయిస్టులు, వారి అనుయాయులను నిర్బంధించారన్నారు.
వివిధ చోట్ల నిర్బంధించబడిన వీరిని వెంటనే సంబంధిత న్యాయ స్థానాల ముందుంచాలని కోరారు. అమాయక గిరిజనులను మావోయిస్టులకు సహకరిస్తున్నారని, మిలిషియాగా పనిచేస్తున్నారని పోలీసులు వివిధ రూపాల్లో వేధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. వేధింపులను, నిర్భందాన్ని వెంటనే నిలిపివేయాలనిసీపీఎం నేత శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
కాగా.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో పట్టుబడ్డ 50 మంది మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. వైద్య పరీక్షల అనంతరం వారందరినీ పోలీసులు న్యాయమూర్తి ముందు ఉంచారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మావో అగ్రనేత హిడ్మా, ఐదుగురు మావోయిస్టులు మరణించారు. అలాగే ఈరోజు కూడా అదే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగగా... కీలక నేతలు హతమైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
బాబా చూపిన బాటలోనే నడుద్దాం: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News