World Environment Day: పర్యావరణ పరిరక్షణలో ఏపీని ఆదర్శంగా చేస్తాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 05 , 2025 | 01:26 PM
World Environment Day: పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతోందని.. దీని పర్యావసానంగా ఇతర ప్రాంతాల్లో కూడా గ్రీన్ కవర్ పెరుగుతోందన్నారు.

అమరావతి, జూన్ 5: వచ్చే నాలుగేళ్లలో ఐదు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naiud) పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పరిధిలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతవరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారాయణ (Minister Narayan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మొన్నటి వరకు వనజీవి రామయ్యను చూశామని.. ఆయన లేకపోయినా ఇప్పుడు నల్లమల పరిరక్షణ కోసం అంకారావు కృషి చేస్తున్నారని అన్నారు.
ఈరోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతోందని.. దీని పర్యావసానంగా ఇతర ప్రాంతాల్లో కూడా గ్రీన్ కవర్ పెరుగుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి చెట్ల వల్ల ఉపయోగం తెలియదని.. వారికి చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టడం తెలియదని విమర్శించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళితే కింద రోడ్డుపై చెట్లు నరికేవారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వస్తుంటే ఎక్కడైనా ఒక్క చెట్టు తాము నరుకుతున్నామా అని ప్రశ్నించారు. కొన్ని దేశాల్లో చెట్లు నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారన్నారు. చెట్లు నరికితే మనిషిని చంపినట్టే అని కొన్ని దేశాల్లో చట్టాలు కూడా ఉన్నాయన్నారు. నాలుగు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 37 శాతం గ్రీన్ కవర్ రావాల్సి ఉందన్నారు. జీవితంలో 10 చెట్లు కంటే ఎక్కువ పెట్టి పెంచుతున్నవారు ఉన్నారని.. అసలు చెట్లు పెంచని వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడిది అని సీఎం చంద్రబాబు నిలదీశారు.
రాఖీలు కట్టే చెల్లెమ్మలకు ఇకపై అన్న నక్షత్రం పేరుకు తగ్గట్టుగా విత్తనాలు ఇస్తామన్నారు. ఈ ఏడాదిలోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చూడతామని తెలిపారు. నక్షత్రం చూసుకుని అన్నకు రాఖీ కడితే చెట్ల పెంపకానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో రూఫ్ టాప్ గార్డెన్ లేదా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చేపలు, చికెన్, ఇళ్లలో నుంచి వచ్చే వెస్ట్తో రీసైక్లింగ్కు ఉపయోగిస్తామన్నారు. నల్లమల అడవుల్లో విలువైన మూలికలు ఉన్నాయన్నారు. ఎర్రచందనంతో పాటు నల్లమల అడవులలో ఉన్న వనమూలికలనూ కాపాడుకోవాలని చెప్పుకొచ్చారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని.. వచ్చే మూడేళ్లలో వెస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు వస్తున్నాయన్నారు. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా ప్లాస్టిక్ను నిషేధిస్తామన్నారు. 175 నియోజక వర్గాల్లో నగర వనాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవ్వండి.. సీఎం చంద్రబాబు పిలుపు
జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం
Read Latest AP News And Telugu News