Chevireddy Mohith Reddy: చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:30 AM
Chevireddy Mohith Reddy: ఏపీ లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి మోహత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు.. ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.

విజయవాడ, జూన్ 23: ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) సిట్ అధికారులు (SIT Officers) దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి.. వారిని విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి (Chevireddy Mohith Reddy) సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈనెల 25న సిట్ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతడి బినామీగా చెప్పుకుంటున్న వెంకటేశ్ నాయుడును సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వీరి పాత్ర ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో నిర్ధారిస్తూ కోర్టుకు నివేదికను సమర్పించారు. చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలోనే అతడి కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా ఏ369గా ఇందులో చేర్చారు. మద్యం కుంభకోణం కేసులో తండ్రీకొడుకుల పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ముందస్తు బెయిల్ కోసం గత శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై నేడు (సోమవారం) విచారణ చేస్తామని కోర్టు తెలిపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మోహిత్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏ1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారానే మొత్తం మద్యం కుంభకోణం వ్యవహారం నడిచిందని ఇప్పటికే సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహిత్ రెడ్డి పోటీ చేసిన నేపథ్యంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా డబ్బులను తీసుకున్నారని, అందులో చెవిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు నిర్ధారించారు. దాదాపు రూ.250 కోట్లను మధ్యవర్తుల ద్వారా జిల్లాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది. మోహిత్ రెడ్డికి కూడా డబ్బుల చేరినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బులు ఏ విధంగా చేరాయి.. ఎవరి ద్వారా డబ్బులు వచ్చాయి.. ఏ విధంగా పంపిణీ చేశారు అనే విషయాలపై మోహత్ రెడ్డిని విచారించాలని సిట్ భావిస్తోంది. దీంతో మోహిత్ రెడ్డి నుంచి సమాచారం రాబట్టేందుకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో సిట్ విచారణకు మోహిత్ రెడ్డి రాకపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి
వృద్ధురాళ్ల హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు
వైసీపీ కార్యకర్తలపై జగన్ కామెంట్ల ప్రభావం
కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం సిగ్గుచేటు..
Read Latest AP News And Telugu News