Yoga Rally: యోగాకు పెరుగుతున్న ఆదరణ: కలెక్టర్ లక్ష్మీ శా
ABN , Publish Date - Jun 09 , 2025 | 09:41 AM
Yoga Rally: భారతదేశంలో పుట్టిన యోగా .. విశ్వ వ్యాప్తం అవుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా అన్నారు. నేడు ఎన్నో దేశాలు యోగాని దినచర్యలో భాగం చేసుకున్నాయని తెలిపారు. మన దేశంలో కూడా యోగాకు ఆదరణ పెరుగుతోందని అన్నారు.

విజయవాడ, జూన్ 9: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో నెల రోజుల పాటు యోగాంధ్ర (Yogandhra) కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతీ రోజు అన్ని వర్గాల ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్ను (BRTS Road) యోగా రోడ్గా మార్చేశారు. అక్కడ చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతీరోజు యోగాసనాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. యోగాంధ్రలో భాగంగా యోగాపై అవగాహన కలిగిస్తూ నగరంలో ఈరోజు (సోమవారం) భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ సాగింది.
జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా, మున్సిపల్ కమీషనర్ ధ్యాన చంద్ర ఈ ర్యాలీని ప్రారంభించి ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు నడిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారతదేశంలో పుట్టిన యోగా .. విశ్వ వ్యాప్తం అవుతోందన్నారు. నేడు ఎన్నో దేశాలు యోగాను దినచర్యలో భాగం చేసుకున్నాయని తెలిపారు. మన దేశంలో కూడా యోగాకు ఆదరణ పెరుగుతోందని అన్నారు. ప్రతి రోజూ యోగాసనాల ద్వారా రోగాలు, రుగ్మతలు దరిచేరకుండా చేయవచ్చని వెల్లడించారు. జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. ప్రతీరోజూ వివిధ వర్గాల వారు, చిన్నారుల నుంచి వృద్దుల వరకు అందరితో యోగాసనాలు చేయిస్తున్నామని అన్నారు. బీఆర్టీఎస్ రోడ్ను యోగా రోడ్గా మార్చి, ప్రతీరోజు యోగా చేసుకునేలా ఏర్పాటు చేశామని తెలిపారు.
జూన్ 21న విశాఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) యోగా డేలో పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో ఆరోజు రెండు కోట్ల మంది పాల్గొనేలా ప్రభుత్వం సన్నద్ధం చేస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పది లక్షల మందిపైగా ఆరోజు యోగాలో పాల్గొంటారని తెలిపారు. యోగాసనాలు వేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతీరోజూ ఒక 45 నిమిషాలు యోగాకు కేటాయించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండండి... ఆస్పత్రులకు అయ్యే డబ్బులు ఆదా చేసుకోండి అని కలెక్టర్ లక్ష్మీ శా తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీమంత్రి హరీష్ రావు
మస్క్ను కలవరపెడుతున్న మరో సమస్య.. మస్క్కు సూర్యుడి దెబ్బ..
Read Latest AP News And Telugu News