AP 10th Results: ఏపీ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల
ABN , Publish Date - Apr 23 , 2025 | 10:08 AM
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల ఫలితాలును ఐటీ విద్య శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. పదో తరగతి రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సయితం విడుదల చేశారు.

AP 10th Results: విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు (10th Results) బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల అయ్యాయి. ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఫలితాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఈ ఏడాది 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి వెల్లడించారు. 81.14 శాతం ఉత్తీర్ణత సాధించారని, పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతం ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో 1,680 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయినవారు నిరుత్సాహపడవద్దని సూచించారు. జీవితం రెండవ అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుండి 28 వరకు జరుగుతాయన్నారు. ఇది విజయం సాధించడానికి మరొక అవకాశాన్ని అందిస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/, మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్లోనూ విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే వాట్సప్ నంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ చేసి, విద్యా సేవల ఆప్షన్ ద్వారా ఫలితాలను పీడీఎఫ్ కాపీ రూపంలో పొందవచ్చు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా టెన్త్ ఫలితాలతో పాటే విడుదల చేశారు.
హాయ్ అని మెసేజ్ చేసి ఫలితాలు తెలుసుకోండి..
విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లోని వాట్సాప్లో 9552300009 నంబర్కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి. వెంటనే సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది. అందులో విద్యా సేవలను ఎంచుకోవాలి. అనంతరం ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను సెలక్ట్ చేసుకోవాలి.. అక్కడ రోల్ నంబర్ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు డిస్ప్లే అవుతాయి. ఈ రిజల్ట్ పీడీఎఫ్ (PDF) కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే.. పదో తరగతి రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేశారు. ఈ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలను https://apopenschool.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
కాగా ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.