Lokesh On Kumki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ
ABN , Publish Date - May 22 , 2025 | 10:46 AM
Lokesh On Kumki Elephants: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మంత్రి లోకేష్ అభినందించారు.

అమరావతి, మే 22: రాష్ట్రంలో ఏనుగుల గుంపులను తరిమికొట్టి, రైతుల బాధలను తీర్చేందుకు కుంకీ ఏనుగులను ఇవ్వాల్సిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) కోరిక మేరకు కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) నాలుగు కుంకీ ఏనుగులను ఏపీ అప్పగించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి కుంకీ ఏనుగులు రావడంపై మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పందించారు. కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అభినందలు తెలియజేశారు. అలాగే అవసరమైతే మరిన్ని కుంకీ ఏనుగులు ఇచ్చేందుకు హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేష్ స్పందించారు.
లోకేష్ ట్వీట్ ఇదే
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవచూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
నిన్న(బుధవారం) బెంగళూరులో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కుంకీ ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్నారు. బెంగళూరులోని విధానసౌధ వద్ద జరిగిన కుంకీ ఏనుగుల అప్పగింత కార్యక్రమానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే హాజరయ్యారు. ఈ సందర్భంగా గజ పూజ అనంతరం కర్ణాటక అధికారులు జెండా ఊపి కుంకీ ఏనుగులను సాగనంపగా.. డిప్యూటీ సీఎం పవన్ పూలుజల్లి ఆ ఏనుగులను స్వాగతించారు. కుంకీ ఏనుగులు కృష్ణ (15 ఏళ్లు) అభిమన్యు(14), దేవా (39), రంజన్ (26)లను కర్ణాటక అధికారులు ఏపీ అధికారులకు అప్పగించారు. త్వరలో మరో రెండు ఏనుగులను అప్పగిస్తామని ఈ సందర్భంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
ఇవి కూడా చదవండి
మ్యూజియం వద్ద కాల్పులు..ఇద్దరు మృతి
Read latest AP News And Telugu News